విజువల్ మ్యాజిక్ తో మైనస్ అయిన మెసేజ్! (‘2.ఓ’ మూవీ రివ్యూ)

―సికిందర్

2010 లో రజనీకాంత్ నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ‘రోబో’ విడుదలై సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఎనిమిదేళ్ళ తర్వాత దీని సీక్వెల్ గా ‘రోబో 2.0’ విడుదలయింది. మొదటిది 130 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే, ఈ సీక్వెల్ ని దేశంలోనే అతి భారీ బడ్జెట్ 543 కోట్ల తో తెరకెక్కించారు. రజనీకాంత్ కెరీర్ ప్రారంభదినాల్లో కమల్ హాసన్, మమ్ముట్టి వంటి ఇతర స్టార్లతో కలిసి మల్టీ స్టారర్స్ లో నటించారు. తిరిగి ఇప్పుడు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తో ఈ మల్టీస్టారర్ చేశారు. ఈ సైన్స్ ఫిక్షన్ లో ప్రధానంగా సెల్ ఫోన్ల వల్ల పక్షిజాతి వినాశ సమస్యని చూపించారు. అయితే ఇది అర్ధవంతంగా చూపించారా, లేక విజువల్ మ్యాజిక్ తో సంతృప్తి పర్చే ప్రయత్నం చేశారా ఒకసారి చూద్దాం…

కథ
ఒక పక్షి శాస్త్రవేత్త సెల్ టవర్ మీద ఆత్మహత్య చేసుకోవడంతో ప్రారంభమవుతుంది కథ. ఆ తర్వాత ఉన్నట్టుండి నగరంలో ప్రజల దగ్గర్నుంచి దగ్గర సెల్ ఫోన్స్ ఎగిరిపోవడం ప్రారంభిస్తాయి. ఆకాశంలో అదృశ్య శక్తి ఏదో వాటిని లాగేసుకుంటుంది. సెల్ ఫోన్ల ఉత్పత్తిదారు, నెట్వర్క్ ప్రొవైడర్ ఇద్దర్నీ తూఫానులా కమ్మేసి సెల్ ఫోన్లు చంపేస్తాయి. ఈ సెల్ ఫోన్లు పక్షుల రూపాన్ని ధరించి బీభత్సం సృష్టిస్తూంటాయి. సైంటిస్ట్ డాక్టర్ వశీకరణ్ (రజనీకాంత్) అతడి అసిస్టెంట్ వెన్నెల (అమీ జాక్సన్ – ఈమె హ్యూమనాయిడ్ రోబో) అసలేం జరుగుతోందో తెలుసుకోవడానికి పూనుకుంటారు.

ఇక ప్రజల్ని రక్షించడానికి డాక్టర్ వశీకరణ్ తను గతంలో రూపొందించిన చిట్టీ (ఇప్పుడు 2.0 గా అప్డేట్ చేసిన రోబో- ఈ పాత్రలో రజనీ) ని దింపుతానంటే ప్రభుత్వం ఒప్పుకోక మిలిటరీని దింపుతుంది. మిలిటరీ కూడా ఓడిపోయాక డాక్టర్ వశీకరణ్ చిట్టీని దింపుతాడు. అప్పుడు చిట్టీకి ముఖాముఖీ అవుతుంది విధ్వంసక మహా పక్షి. ఇది ప్రకృతిలో కనిపించని ఐదో శక్తి. ఈ శక్తి రూపాన్ని ధరించింది మొదట్లో ఆత్మహత్య చేసుకున్న పక్షిశాస్త్ర వేత్త పక్షిరాజా (అక్షయ్ కుమార్). ఇతను ఐదో శక్తిగా పక్షి రూపంలో తిరిగి వచ్చి ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. దేనిగురించి ప్రతీకారం? ఎందుకు ప్రతీకారం? దీన్ని చిట్టీ ఎలా ఎదుర్కొని మానవ జాతిని కాపాడింది?…ఇదీ కథ.

ఎలావుంది కథ

2.0 కథ ప్రకృతిలో ఐదో భౌతిక శక్తి గురించి…భౌతిక శాస్త్రంలో ఇంతవరకూ కనుగొన్నశక్తులు నాల్గు వున్నాయి : గురుత్వాకర్షణ శక్తి, విద్యుదయస్కాంత శక్తి, బలమైన అణుశక్తి, బలహీన అణుశక్తి. ఈ నాల్గు శక్తులకి తోడూ అయిదవదిగా ఒక నెగెటివ్ శక్తి వుండాలని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ ఐదవ నెగెటివ్ శక్తి కథే 2.0 కథ. సెల్ ఫోన్ల వల్ల పక్షులకి జరుగుతున్న హానికి చెక్ పెట్టేందుకు పూనుకున్న పక్షిరూపంలోని ఐదవశక్తి – సెల్ ఫోన్ టెక్నాలజీని అంతమొందించాలని చూస్తుంది. సెల్ టవర్లు విడుదల చేసే విద్యుదయస్కాంత శక్తివల్ల పక్షులు అంతరించిపోతున్నాయన్నఆవేదన ఈ నెగెటివ్ శక్తిది. అయితే ఈ కథకి కథా ప్రయోజనం నెరవేరిందా అంటే లేదు. ఈ అయిదవ శక్తి ఆవేదనని అర్ధం జేసుకోకుండా దాన్ని దారుణంగా అంతమొందించడమే కథగా ముగుస్తుంది.

ఎవరెలా చేశారు

రజనీకాంత్ 3.0 రోబోగా మారినప్పుడే ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతారు- తన రజనీ స్టయిల్ తో, డైలాగులతో. అయితే ప్రేక్షకుల సానుభూతిని పొందుతున్న పక్షిరాజాని వెక్కిరిస్తూ పోరాటాలు చేయడమే రుచించదు. సైంటిస్టు వశీకరణ్ గా హుందాగా కన్పిస్తారు. రోబో 2.0 గా యాంత్రికంగా కన్పిస్తారు. ఇంకా మైక్రో రోబోలుగా ఉత్సాహాన్ని నింపుతారు. ఇలా నాల్గు రూపాల్లో రజనీ కన్పిస్తూ పోవడం సినిమా డైనమిక్స్ ని పెంచింది. ఇక హ్యూమనాయిడ్ రోబోగా అమీ జాక్సన్ ది మరమనిషి నటనే. అక్షయ్ కుమార్ కి అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్ వుంది. మళ్ళీ ఇది ‘భారతీయుడు’ లో కమల్ హాసన్ ఫ్లాష్ బ్యాక్ అంత హృద్యంగా, పోయెటికల్ గా, చాలా ఎమోషనల్ గా వుంది. సినిమాకి ఇదే ఆయువుపట్టు. ఈ పాత్రలో, తర్వాత పగబట్టిన మహా పక్షి పాత్రలో అతను విలనీకి ఒక పాజిటివ్ కోణాన్ని అద్భుతంగా సంతరింపజేశాడు. పాత్ర పరంగా తన వాదన కూడా న్యాయమే అయినా, పాత్రకి ముగింపు మాత్రం అన్యాయంగానే వుంది.

ఇదొక అద్భుత సాంకేతిక విలువలతో విజువల్ వండర్ అనక తప్పదు. అడుగడుగునా యాక్షన్ దృశ్యాలు కళ్ళప్పగించి చూసేలా చేస్తాయి. స్టేడియంలో సుదీర్ఘంగా అరగంట క్లయిమాక్స్ దృశ్యాలు క్షణం క్షణం మారిపోయే పోరాట వ్యూహాలతో చాలా థ్రిల్ చేస్తాయి. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతంలో ఫ్లాష్ బ్యాక్ లో పిచ్చుకల మీద ఒకే పాట, ఒక నేపధ్య గీతం మాత్రమే వుండడం, అవీ హైలైట్ గా వుండడం ఒక ప్లస్ పాయింట్. ఇంకో రెండు ప్లస్ పాయింట్లు ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పోకుట్టి సౌండ్ ఎఫెక్ట్స్, ఆంథోనీ ఎడిటింగ్. శ్రీరామ కృష్ణ అనువదించిన డైలాగుల్లో అక్షయ్ కుమార్ నోట “పిచ్చుకలు మనతో కలిసి బతకలేక పోతే ఎందుకు మనకీ ఎదుగుదల? ఎందుకీ టెక్నాలజీ?” అనేది కదిలిస్తుంది.
ఈ మూవీ దాదాపు వీఎఫ్ఎక్స్ తోనే సాగేది కాబట్టి, శంకర్ దర్శకత్వం కన్నా వీఎఫ్ఎక్స్ మేనేజిమెంటే ప్రధానంగా కన్పిస్తుంది. విజువల్స్ తో సమర్ధవంతంగా దీన్నొక విజయవంతమైన సైన్స్ ఫిక్షన్ మూవీగా నిలబెట్టాడు.

చివరికేమిటి

స్క్రీన్ ప్లే దీనికి ప్రాణం. స్క్రీన్ ప్లేలో పోషించిన డైనమిక్స్ హైలైట్స్. ఎంత గ్రాఫిక్స్ టెక్నాలజీ వాడినా కథని ఉత్కం రేపే సన్నివేశాలతో నడపడంతో పూర్తీ విజయం సాధించారు. హాలీవుడ్ పరిభాషలో ఇది హై కాన్సెప్ట్ మూవీ. హై కాన్సెప్ట్ మూవీస్ కథ సింపుల్ గా, యాక్షన్ భారీగా వుంటాయి. ఎక్కువ ట్విస్టులు, డ్రామా, ఇతర మసాలాలూ వుండవు. మానవాళికి ముంచుకొస్తున్న ముప్పుని నివారించే కథలతో వుండే హై కాన్సెప్ట్ మూవీస్ విజువల్ హంగామాతోనే వుంటాయి. అయితే చెప్పదలచుకున్న విషయాన్ని సమగ్రంగా చెప్పాల్సి వుంటుంది. పక్షి శాస్త్ర వేత్త ఆత్మహత్య చేసుకోక ముందు సెల్ టవర్స్ వల్ల పక్షులకి జరుగుతున్నా హానీ, ఆ పక్షులకి జరుగుతున్న హాని వల్ల పర్యావరణానికి జరుగుతున్నహానీ, తద్వారా రేపు మానవాళికి జరిగే హానీ- సామాన్య ప్రేక్షకులకి కూడా అర్ధమై ఫీలయ్యేల్లా చక్కగా చెప్తాడు.

పక్షులు వుండి అవి పురుగుల్ని తినకపోతే, ఆ పురుగులు పంటల్ని తినేస్తే మనుషులేం తింటారు? అందుకని సెల్ ఫోన్ కంపెనీలు పోటీలు పడి చట్టాన్నుల్లంఘించి పెంచేస్తున్న ఫ్రీక్వెన్సీల్ని తగ్గించమనే పోరాటం చేస్తాడతాను. ఇది కంపెనీలూ ప్రభుత్వమూ ఒప్పుకోకపోతే, ఆత్మహత్య చేసుకుని ఐదవ శక్తిగా అవతరించి ప్రమాదం తలపెడతాడు. అప్పుడైనా ఈ ఐదవ శక్తిని – చచ్చిన పక్షుల ఆత్మలతో ఏర్పడిన ఈ ఐదవ శక్తి ఆవేదనని అర్ధం చేసుకుని ఆ ప్రకారం చర్యలు తీసుకుంటే సరిపోతుంది. ఇలాకాకుండా, దీన్ని వెక్కిరిస్తూ పోరాటాలు చేసి చంపేసి – ఒక మేసేజి ఇస్తారు. ఈ మేసేజిలో సూచనలు ఆ పక్షి శాస్త్ర వేత్త చేసినవే! మరెందుకు చంపారు పాపం?

నటీనటులు: రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, అమీ జాక్సన్‌, సుదాంశు పాండే, అదిల్‌ హుస్సేన్‌, కళాభవన్‌ షాంజాన్‌, రియాజ్‌ఖాన్‌ తదితరులు
సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌
సినిమాటోగ్రఫీ: నీరవ్‌ షా
ఎడిటింగ్‌: ఆంథోని
ఆర్ట్‌: టి.ముత్తురాజు
వీఎఫ్‌ఎక్స్‌ అడ్వైజర్‌: శ్రీనివాసమోహన్‌
ఫైట్స్‌: సెల్వ
నిర్మాత: ఎ.సుభాష్‌కరణ్‌, రాజు మహాలింగం
రచన, దర్శకత్వం: శంకర్‌
సంస్థ: లైకా ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ: 29-11-2018

Rating:/ 5