కూటమి రాజకీయాల మీద మంచి కథ చెప్పిన కవిత

శనివారం జగిత్యాల నియోజక వర్గం లో ని రాయికల్ మండలం ఇటిక్యాల లో డాక్టర్ సంజయ్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జగిత్యాల నియోజకవర్గం రాయికల్ మండలం ఇటిక్యాల లో బతుకమ్మలు కోలాటాలతో ఎంపీ కవిత కు మహిళలు ఘనస్వాగతం పలికారు. వారితో కలిసి కోలాటం, బతుకమ్మ ఆడారు కవిత.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాకూటమివి ఆపద మెుక్కులన్నారు.   ఆపద మొక్కుల పై ఒక మంచి కథ చెప్పారు ఎంపి కవిత.

ఆ కథేంటో తెలుసా?

అనగనగా ఒక బట్టలు కుట్టే ఆయన. ఒక రోజు  ఆయన సూది కిందపడింది. అది ఎంత వెతికినా కనబడకపోవడంతో… దేవుడా సూది దొరుకుతే అందరికీ కిలో పంచదార పంచి పెడతానని మొక్కుకున్నాడు.. ఇది విన్న ఆయన భార్య సూదికోసం కిలో పంచదార పంచి పెట్టడం ఏంటండి అని ప్రశ్నించింది.. దేవుడు మంచి వాడు..సూది దొరికితే పంచదార పంచక పోయినా దేవుడు ఏమనుకోడులే.. అని అన్నాడట… అద కథ.

అట్లాగే ఉంది కూటమి నేతలు చెప్తున్న మాటలు, హామీలు అని కవిత ప్రజలకు వివరించారు. కేసీఆర్ కు ప్రజల కష్టాలు తెలుసునని, అడక్కుండానే అన్ని పనులు ఆయన చేస్తారని తెలిపారు. ఇది చేస్తాం ..అది చేస్తాం.. అని వాగ్దానాలు చేసిన వారు కనపడకుండా పోయిన విషయం మీకు తెలుసు అన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ డాక్టర్ సంజయ్ అన్న మీ వెంటే ఉంటూ మీకు అండదండగా నిలుస్తున్న విషయం మీకు తెలుసు అన్నారు.

ఇటిక్యాల లో 14 వందల మందికి పెన్షన్లు వస్తున్నాయని గతంలో ఎన్ని పెన్షన్లు వచ్చేవని ప్రజలను ప్రశ్నించారు. ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ల లో పావు వంతు కూడా రాలేదని ప్రజలు తెలిపారు. టిఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే 58 ఏళ్ల వయస్సు ఉన్న వారికి కూడా పెన్షన్లను ఇస్తారని తెలిపారు. వెయ్యి రూపాయల పెన్షన్ 2000 వికలాంగులకు ఇస్తున్న 1500 పెన్షన్ ని మూడు వేలకు పెంచుతామని చెప్పారు. నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేల రూపాయలు భృతి గా చెల్లిస్తారని తెలిపారు. జాగాలు ఉన్నవారికి డబుల్ బెడ్ రూమ్ లకు అవుతున్న ఖర్చు మొత్తాన్ని నేరుగా వారి ఎకౌంట్లో వేస్తారని జాగాలు లేనివారికి డబుల్ బెడ్ రూమ్ లలో అవకాశం కల్పిస్తారని కవిత వివరించారు.

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జాగాలేని చోట డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టారని… ఇండ్లు అసలే కట్టవద్దన్న ఆలోచన ఆయనది అని కవిత అనగానే ప్రజలు పెద్ద పెట్టిన జై తెలంగాణ నినాదాలు చేశారు. బీసీలు, ఎంబీసీలు, ఎస్సీలు ఆర్థికంగా బలపడడం కోసం బ్యాంకుల తో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా రుణాలను ఇచ్చేలా కేసీఆర్ కార్యాచరణ రూపొందించారని, పేదలందరి సంక్షేమం కోసం ఆయన ఆలోచిస్తున్నారని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి టిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ జగిత్యాల అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ తో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మూటపల్లి లో… రైతులను ఆగం చేసే పనిలో కూటమి అభ్యర్థులు ఉన్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు ఎంపీ కవిత. టిఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే రైతులకు నీళ్లు ఇవ్వరని దుష్ప్రచారం చేస్తున్నారని, రైతుల్లో అభద్రతను పెంచుతున్నారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఎస్ ఆర్ ఎస్ పి లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని నీళ్లు ఇచ్చే బాధ్యత నాదే అని ఎంపీ కవిత రైతులకు హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు తెలంగాణలో చక్రం తిప్పేందుకు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు అని తెలిపారు. మనకు నీళ్ల పంచాయతీ వస్తే ఆయన మనకు న్యాయం చేస్తాడా… ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేస్తాడా.. అనే విషయం ఆలోచించుకోవాలని రైతులను కోరారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు 35 లేఖలను కేంద్రానికి రాశారని వివరించారు.