నిజామాబాద్ లో దారుణం..పిల్లలు తనకు దక్కలేదన్న కోపంతో దారుణానికి పాల్పడిన భర్త!

భార్యాభర్తలు అన్న తర్వాత అప్పుడప్పుడు వారి మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవ పడుతూ ఉంటారు. అయితే కొంతమంది ప్రతి విషయానికి గొడవ పడుతూ దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో భార్యాభర్తలు మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకోవటం లేదా కక్ష పెంచుకొని వారిని హత్య చేయటానికి కూడా వెనకాడటం లేదు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా భర్తకి దూరంగా ఉంటూ పిల్లల్ని తన వద్ద ఉంచుకున్న భార్యని భర్త కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు.

వివరాలలోకి వెళితే…నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలం కొల్లూర్‌లో నివాసం ఉంటున్న పోశెట్టి(50), అంజనీ(45) దంపతులకు వివాహం జరిగి 30 ఏళ్లు పూర్తయింది. వీరికి 24 సంవత్సరాల రచన అని కుమార్తెతో పాటు 12 సంవత్సరాల సాయి తేజ అనే కుమారుడు ఉన్నాడు. అంజని స్థానికంగా ఆశా కార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది. ఏడాది క్రితం కుమార్తె రచనకు వివాహం చేయగా ఆమె భర్తతో మనస్పర్ధలు వచ్చి పుట్టింట్లో ఉంటుంది. అయితే చాలా కాలంగా అంజని పోసెట్టి దంపతులిద్దరూ తరచూ గొడవ పడుతూ ఉండేవారు. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు పెరగడంతో పెద్ద మనుషుల మధ్య పంచాయతీ నిర్వహించి ఇద్దరినీ వేరువేరుగా ఉండమని పెద్దలు నిర్ణయించారు.

ఈ క్రమంలో అంజని తన కూతురు కొడుకుతో కలిసి స్థానికంగా నివాసం ఉండగా పోసెట్టి ఒంటరిగా వేరుగా ఉంటున్నాడు. అయితే రెండు నెలలుగా పోసెట్టి ఒంటరిగా ఉండటంతో తన భార్య వల్లే పిల్లలు తనకి దూరమయ్యారని ఆమె మీద కక్షపించుకున్నాడు. దీంతో ఎలాగైనా ఆమెను అంతం చేయాలని భావించి బుధవారం రాత్రి ఫుల్లుగా మద్యం తాగి అంజని మీద కత్తితో దాడి చేశాడు. అయినా కూడా ఆమె మరణించకపోవడంతో పక్కనే ఉన్న గొడ్డలి తీసుకుని ఆమెను కిరాతకంగా నరికి హత్య చేశాడు. అంజనీ కూతురు, కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.