కేంద్ర ప్రభుత్వంతో వైఎస్ జగన్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడు ఏం అవసరం వస్తుందో చెప్పలేం కాబట్టి నిత్యం సఖ్యత మైంటైన్ చేస్తున్నారు. కొందరు ముఖ్యమంత్రులు అవసరం వచ్చినప్పుడు వినయంగా, అవసరం తీరాక తలబిరుసుగా ఉంటుంటారు కేంద్రంతో. అలాంటివారికి ఢిల్లీలో పెద్దగా పనులు జరగవు. కాబట్టే జగన్ ఎల్లప్పుడూ శాంతియుతంగానే ఉంటున్నారు. కేంద్రానికి సహాయం కావాల్సి వచ్చినప్పుడల్లా భేషరతుగా మద్దతు ఇచ్చేస్తున్నారు. ఏ బిల్లు ప్రవేశపెట్టినా ఎన్డీయే వైపే ఉంటున్నారు. ఢిల్లీ వరకు మాత్రం మోదీ దారిలోనే వెళుతున్నారు.
ఇటీవల జరిగిన కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త విద్యుత్ చట్టాన్ని అంగీకరించి అమలుచేసే పనిలో ఉన్నారు. తాజాగా జరిగిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి ఎన్నికలో వైసీపీ ఎంపీలు ఎన్డీయే అభ్యర్థికి మద్దతిచ్చారు. ఇంతలా సహకరిస్తున్నప్పుడు అప్పుడప్పుడైనా కావలసిన పనులు చేయించుకోవాలనే కోరిక జగన్ లో కూడ ఉంటుంది కదా. అందుకే కొన్ని కీలక విషయాల్లో కేంద్రం సపోర్ట్ కోరుతున్నారు. ఇవి కీలక విషయాలు మాత్రమే కాదు జగన్ వ్యక్తిగతంగా భావిస్తున్న అంశాలు. వైఎస్ జగన్ శాసన సభలో ఏ బిల్లు అమోదింపజేసుకున్నా టీడీపీ ఉద్దేశ్యపూర్వకంగా శాసన మండలిలో అడ్డుపడుతోంది. ఇది జగన్ కు పెద్ద తలనొప్పిలా మారింది.
అందుకే ఆయన మండలిని రద్దు చేసేసి, ఆమోదించాలని రద్దు బిల్లును కేంద్రం వద్దకు పంపారు. కానీ ఇంకా సమాధానం రాలేదు. అలాగే పార్టీలో తిరుగుబాటు చేస్తున్న ఎంపీ రఘురామకృష్ణరాజు మీద అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఓంబిర్లాకు పిటిషన్ పెట్టుకున్నారు. దాని మీద కూడ ఇంకా ఆమోదం రాలేదు. ఈ రెండు పనులు కూడ కేంద్రం చేతిలో పనులు. కానీ కావట్లేదు. అదే జగన్ కు అసహనం తెప్పిస్తోంది. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు మీద తప్పక అనర్హత వేటు వేయించి తీరాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. కాబట్టే నేతలను ప్రత్యేక విమానంలో ఢిల్లీ పంపారు. కానీ రామరాజు మీద ఎలాంటి చర్యలు లేవు.
దాన్ని అలుసుగా తీసుకున్న రెబల్ ఎంపీ ఢిల్లీలో కూర్చొని జగన్ మీద, ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన మాటలు, ఆరోపణలు ప్రత్యర్థులకు ఆయుధాలవుతున్నాయి. రోజు మార్చి రోజు ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్నాయి. అందుకే ఈ పార్లమెంట్ సమావేశాల్లో అనర్హత వేటు వేయించి రఘురామరాజుకు తన సత్తా చూపాలని జగన్ గట్టిగా డిసైడ్ అయ్యారు. కానీ రామరాజు మాత్రం తనకు బీజేపీ అండ ఉందని, తనను ఏమీ చేయలేరని పరోక్షంగా సంకేతాలిస్తూ చెలరేగిపోతున్నారు. దీంతో ఆయన మీద అనర్హత వేటు అనేది జగన్ ఇజ్జత్కే సవాల్ అన్నట్టు తయారైంది. అందుకే తాను అందించిన సహకారాన్ని ఏకరువు పెట్టి మరీ రఘురామక్రిష్ణరాజు మీద అనర్హత వేటు వేయాల్సిందేనని కేంద్రం ముందు గట్టిగా నిలబడుతున్నారట ఆయన.