సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహావిష్కరణ చేసిన మోదీ

భారతదేశ మొట్టమొదటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. పటేల్ విగ్రహం ఆవిష్కరించిన వెంటనే హెలికాప్టర్ల నుంచి పటేల్ విగ్రహం పై పూల వర్షం కురిసింది.  గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ సమీపంలో సాధు బెట్‌లో ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ’ని నిర్మించారు. 2013 అక్టోబర్‌ 31 గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో మోదీ ఈ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.

 

 పాదాలను నేలపై మోపి.. మేఘాల్లోకి తలెత్తి.. తాను కలలుగన్న భారతావనిని పరికిస్తున్నట్లు ఉండే పటేల్ విగ్రహాన్ని కేవలం 36 నెలల కాలంలో నిర్మించారు. నిర్మాణ వేగం, నాణ్యత, భారీతనంతో కూడిన ఈ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతమే కాకుండా, దేశీయ సాంకేతికత స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పనుంది.

నేడు భారత్ ఐక్యంగా ఉందంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ వల్లనేనని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. భారతదేశంలోని గొప్ప వ్యక్తులను స్మరించుకోవాల్సిన అవసరముందన్నారు. పటేల్ కు నివాళిగా దేశవ్యాప్తంగా ఐక్యతా దినం నిర్వహిస్తున్నామని , దేశసమగ్రతకు కృషి చేసిన పటేల్ విగ్రహావిష్కరణ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని ప్రధాని అన్నారు.

182మీటర్ల (దాదాపు 600 అడుగులు) ఎత్తుతో రూపొందించిన ఐక్యతా విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) ప్రపంచంలోనే అతి ఎత్తయిన విగ్రహంగా నిలుస్తున్నది. ఎల్‌అండ్ టీ సంస్థ దీన్ని 33 నెలల్లోనే పూర్తిచేసింది. ఇప్పటివరకు ప్రపంచంలో అతిపెద్ద విగ్రహంగా ఉన్న స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ విగ్రహం ఉండగా, దాని నిర్మాణానికి చైనాకు 11 సంవత్సరాల సమయం పట్టింది. 

విగ్రహ ప్రత్యేకతలివే…

– (25 మీటర్ల పీఠంతోపాటు) అంటే, సుమారు 600 అడుగుల ఎత్తు. నదీమార్గం నుంచి అయితే ఈ ఎత్తు మరో 26.5మీటర్లు అదనం. 

-5.6 అడుగుల ఎత్తు ఉండే ఓ సగటు వ్యక్తి కన్నా ఇది వందరెట్లు ఎక్కువ ఎత్తయిన విగ్రహం

-న్యూయార్క్ (అమెరికా) లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం కన్నా పటేల్ విగ్రహం ఎత్తు రెండురెట్లు ఎక్కువ. 

-70 వేల టన్నుల సిమెంట్, 18,500 టన్నుల బరువైన ఉక్కు, 6,500వేల టన్నుల నిర్మాణ ఉక్కు, రెండువేల మెట్రిక్ టన్నుల కంచుతో విగ్రహాన్ని రూపొందించారు. 

-ఉపయోగించిన కాంక్రీట్- లక్షా40వేల క్యూబిక్ మీటర్లు 

-135 మెట్రిక్ టన్నుల ఇనుమును ప్రజల నుంచి సేకరించారు. దీన్ని కూడా విగ్రహ తయారీలో వాడారు.

– నిర్మాణానికి శ్రమించిన కార్మికులు 3000

– నోయిడాకు చెందిన శిల్పి రామ్‌సుతార్ విగ్రహాన్ని డిజైన్ చేశారు. 

– నర్మదా నది మధ్యలో భారీ విగ్రహాన్ని నిర్మించడం ఒక సవాల్‌కాగా, అది నిలబడిన తరహాలో నిర్మించడం మరో చాలెంజ్.

– గంటకు 180 కి.మీ. వేగంతో వీచే గాలులను, రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో కూడిన భూకంపాన్ని తట్టుకునేలా విగ్రహాన్ని నిర్మించారు.

– పటేల్‌కు సంబంధించిన సుమారు 2,000 ఫొటోలను పరిశీలించిన తర్వాతే విగ్రహం ముఖానికి తుదిరూపునిచ్చారు. సర్దార్‌ను ప్రత్యక్షచూసిన వారిని కూడా సంప్రదించారు.

– రెండు హైస్పీడ్ ఎలివేటర్లు ప్రయాణికులను విగ్రహం లోపలి గుండా పైభాగానికి తీసుకెళ్తాయి. పటేల్ విగ్రహం ఛాతి భాగం వరకు వెళ్లి అక్కడి గ్యాలరీ నుంచి భూమ్మీది అందాలను చూడొచ్చు. 200 మంది పర్యాటకులు ఒకేసారి తిలకించేంత పెద్దదిగా ఆ గ్యాలరీని నిర్మించారు.