‘గేమ్‌ ఛేంజర్‌’తో నా కల నెరవేరింది.. దర్శకుడు శంకర్‌ ఆసక్తికర ప్రకటన

రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్’ సినిమా గురించి దర్శకుడు శంకర్‌ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన మరో చిత్రం ‘భారతీయుడు 2’ ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘నేను తెరకెక్కించిన తమిళ చిత్రాలకు తెలుగులోనూ మంచి ఆదరణ దక్కింది. అందుకే నేరుగా తెలుగులోనే ఓ సినిమా తీయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాణ్ని. ఆ మేరకు చేసిన కొన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎట్టకేలకు ‘గేమ్‌ ఛేంజర్‌’తో నా కల నెరవేరుతోంది. కార్తీక్‌ సుబ్బరాజు కథతో దీన్ని రూపొందిస్తున్నా. ఇది పూర్తిస్థాయి యాక్షన్‌ చిత్రం. నా నుంచి ఇలాంటి మాస్‌ సినిమా వచ్చి చాలా కాలమైంది” అని పేర్కొన్నారు.

సంబంధిత విజువల్స్‌ను రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ నెట్టింట పోస్ట్‌ చేస్తూ ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ మాస్‌ ఫిల్మ్‌ అంటూ ఎమోజీలు జత చేస్తున్నారు. ఈ సినిమాలో చరణ్‌ ద్విపాత్రాభినయం చేశారని సమాచారం. కియారా అడ్వాణి హీరోయిన్‌. అంజలి, శ్రీకాంత్‌, ఎస్‌జే సూర్య, నవీన్‌చంద్ర కీలక పాత్రలు పోషించారు. హీరో పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ఇటీవల పూర్తయింది. దాదాపు 10 రోజుల షూటింగ్‌ మిగిలిఉందని శంకర్‌ ఇటీవల ప్రెస్‌విూట్‌లో చెప్పారు. ఫైనల్‌ ఎడిటింగ్‌ అయ్యాక రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తామని తెలిపారు.