రైతులకు శుభవార్త… ట్రాక్టర్ నడపటానికి ఇకపై డ్రైవర్ అవసరం లేదు..?

వ్యవసాయ రంగం మన దేశానికి వెన్నెముక లాంటిది. మనదేశంలో ఎక్కువ శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో వ్యవసాయానికి ఎద్దులను ఉపయోగించేవారు. అయితే ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందటం వల్ల రైతులు ఎద్దులకు బదులు ట్రాక్టర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ట్రాక్టర్ కొనటం ఖర్చుతో కూడుకున్న పని కావటం వల్ల ఇతరుల వద్ద ట్రాక్టర్ ని
అద్దెకు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే ట్రాక్టర్ అద్దకు తీసుకున్న తర్వాత కొన్ని సందర్భాలలో డ్రైవర్లు దొరకడం కష్టం. ఒకవేళ డ్రైవర్ దొరికినా కూడా ట్రాక్టర్ కి రైతు ఆయిల్ కొట్టించటమే కాకుండా.. డ్రైవర్ కి కూడా గంటకు ఇంత అని డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ సమయం పని చేస్తే డబ్బులు ఎక్కువగా వస్తాయి అన్న ఉద్దేశంతో డ్రైవర్లు గంటలో అయ్యే పనిని గంటన్నర చేయాలని చూస్తారు.

ఇలా చేయటం వల్ల ట్రాక్టర్ ఓనర్ తో పాటు డ్రైవర్ కి కూడా లాభం ఉంటుంది కానీ రైతులకేమో భారం అవుతుంది. అయితే ఇలాంటి సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం. టెక్నాలజీ ఉపయోగించి కేవలం మొబైల్ ఫోన్ ద్వారా ట్రాక్టర్ నడపవచ్చు. మొబైల్ ఫోన్ తో డ్రైవర్ లేకపోయినా దర్జాగా ట్రాక్టర్ తో పొలం పనులు చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ ద్వారా ట్రాక్టర్ ని ఆపరేట్ చేయడం ద్వారా డ్రైవర్ లేకపోయినా స్టీరింగ్ దానికదే తిరుగుతుంది. గేర్లు వాటంతటవే మారతాయి. ఈ అధునాతన పరిజ్ఞానాన్ని వరంగల్ కిట్స్ కళాశాల ప్రొఫెసర్ నరసింహారెడ్డి ఆవిష్కరించారు. దీనికి డ్రైవర్ రహిత ట్రాక్టర్ అని పేరు కూడా పెట్టారు.

కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం కింద 2020 ఫిబ్రవరిలో రూ. 41 లక్షలు ఈ ప్రాజెక్టు కోసం మంజూరు చేసింది. మూడేళ్ళ పాటు శ్రమించి ఈ డ్రైవర్ రహిత ట్రాక్టర్ ను విజయవంతం చేశారు. ట్రాక్టర్ కు మైక్రో కంట్రోలర్ అమర్చి.. క్లచ్, బ్రేక్, ఎక్స్ లేటర్ ఆపరేట్ చేసేలా మూడు యాక్చువేటర్ లను అమర్చారు. అలాగే స్టీరింగ్ ని కంట్రోల్ చేయడానికి కూడా ఒక మోటార్ ను అమర్చారు. యాక్చువేటర్ దీన్ని మొబైల్ తో ఆపరేట్ చేసేలా రూపొందించారు. ఐవోటీ పరిజ్ఞానంతో సందేశం క్లౌడ్ కి వెళ్లి.. అక్కడ నుంచి మొబైల్ కు మనం ఇచ్చే ఆదేశాలు వస్తాయి.

ఈ ట్రాక్టర్ ను మొబైల్ ఫోన్ ద్వారా నడపవచ్చు. 45 హెచ్పీ ట్రాక్టర్ పై ప్రయోగాలు చేయగా అది బాగా నడుస్తోందని ప్రాజెక్టు బృందం తెలిపారు. అయితే ఈ సాంకేతికతను రైతులు వాడుకోవాలంటే రూ. 20 వేలు ఖర్చు అవుతుందని వసీమ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ డాక్టర్ నిరంజన్ రెడ్డి కో-ప్రిన్సిపల్ ఇన్వెస్టర్ గా, అసిస్టెంట్ ప్రొఫెసర్ షర్ఫుద్దీన్ వసీమ్ ప్రిన్సిపల్ ఇన్వెస్టర్ గా, ప్రొఫెసర్ నరసింహారెడ్డి ప్రాజెక్ట్ మెంటర్ గా వ్యవహరించారు. బీటెక్ సీఎస్ఈ ఫైనల్ ఇయర్ విద్యార్ధి సాకేత్ ఈ ప్రాజెక్టులో పాలు పంచుకున్నాడు. వీరందరూ కలసి రైతులకు ఉపయోగపడే ఈ డ్రైవర్ రైతు ట్రాక్టర్ ను రూపొందించారు.