వైఎస్ జగన్ ప్రభుత్వానికి చెప్పుకోదగిన ప్రత్యర్థులెవరూ లేరిప్పుడు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అనేక సంక్షోభాల్లో కొట్టుకుంటోంది. ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారో, ఏ క్షణాన ఎవరు బయటికి జంప్ అవుతారో తెలియక సతమవతోంది. అసలు తాము పాలకపక్షం మీద పోరాటం చేయడం కాదు జగన్ అండ్ కో తమను ఇరికిస్తుందేమోనని బిక్కుబిక్కుమంటున్నారు. అలాగే జనసేన సంగతి సరేసరి. ఆ పార్టీలో పవన్ మినహా బలమైన నాయకులెవరూ లేకపోవడంతో వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదు. ఇక మిగిలింది బీజేపీ. ఈమధ్య రాష్ట్రంలో బీజేపీ బాగా యాక్టివ్ అయింది. అందరికంటే ముందే స్పందిస్తూ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఉంది. అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమింపబడ్డాక భారతీయ జనతా పార్టీ యాక్టివిటీస్ పెరిగాయి. ఇంకా ఫామ్లోకి రావడానికి ఆయన ప్రతిపక్షం, అధికార పక్షం మీద విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ ప్రాసెస్లో ఆయన కొన్ని పొరపాట్లు చేస్తున్నట్టు కనిపిస్తున్నారు.
ప్రతిపక్షం కావాలనే తపన :
2024 ఎన్నికలకు ఏపీలో బలమైన శక్తిగా ఎదగాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ మొదటి అడుగుగా జనసేన పార్టీతో చేతులు కలిపింది. రెండవ అడుగుగా విమర్శల పర్వం స్టార్ట్ చేసింది. ఈ విమర్శలు కూడ ఒక్కో పార్టీ విషయంలో ఒక్కోలా ఉంటున్నాయి. అధికార పార్టీ విషయంలో తేలికపాటి విమర్శలు చేసే సోము వీర్రాజు టీడీపీ, చంద్రబాబు విషయంలో మాత్రం విపరీతంగా విరుచుకుపడిపోతున్నారు. ఎందుకంటే 2024కు తాము అధికారంలోకి రాలేమని బీజేపీకి తెలుసు. అందుకే జగన్ ను పీఠం మీద నుండి డింపేందుకు తమ వంతుగా ఒక స్థాయిలో మాత్రమే విమర్శలు గుప్పిస్తున్నారు.
కానీ ప్రతిపక్షం కావాలని బలమైన కోరిక ఉండటంతో చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. బాబుకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని విపరీతంగా చూపిస్తోంది. నిన్నటికి నిన్న రాష్ట్రంలో హిందూ మతం మీద దాడి జరగడానికి కారణం చంద్రబాబు తన హయాంలో క్రైస్తవ మతాన్ని పెంచి పోషించడమే అంటూ ధ్వజమెత్తారు. వైసీపీ విషయంలో మాత్రం జగన్ ను నేరుగా ఏమీ అనకుండా ఆయన పార్టీ పేరు మీద మాత్రమే విమర్శలు చేశారు. చెప్పాలంటే బాబు మీద వీర్రాజు చేసిన విమర్శలు పొందిన ప్రాచుర్యం జగన్ మీద చేసిన విమర్శలు పొందలేదు. అసలు పాలక పక్షం వైసీపీ కాదు టీడీపీ అన్నట్టు, సీఎం జగన్ కాదు చంద్రబాబు అన్నట్టు ఉంది ఆయన విమర్శల యుద్దం.
తెలియకుండానే జగన్కి మేలు :
టీడీపీ అద్వానపు స్థితిలోనే ఉంది. అలాగని వారిని తక్కువ అంచనా వేయడానికి లేదు. కాలం కలిసొస్తే, చంద్రబాబు వ్యూహాలు ఫలిస్తే తెలుగుదేశం పుంజుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకే జగన్ వారిని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి చూస్తున్నారు. ఆ పార్టీ నేతల అవినీతిని బయటికి తోడుతూ ఆరెస్టులు చేస్తున్నారు. విమర్శలతో, ఆరోపణలతో మరింత బ్యాడ్ చేసేలా వ్యూహం పన్నారు. అది వర్కవుట్ అవుతోంది కూడ. వీరికి తోడు బీజేపీ కూడ టీడీపీ మీద పడటంతో టీడీపీ పొజిషన్ దారుణంగా తయారైంది. వైసీపీని నిలువరించలేకపోతున్న వారికి కమల దళం మరింత భారంగా మారింది. దీంతో రెంటి మద్యా టీడీపీ నలిగిపోతోంది. ఎవ్వరినీ సరిగ్గా డిఫెండ్ చేయలేకపోతోంది.
ఇలా బీజేపీ మధ్యలో దూరి టీడీపీ మీద యుద్దం స్టార్ట్ చేయడంతో వైసీపీకి మరింత బెనిఫిట్ అయింది. బీజేపీ అదే పనిగా టీడీపీని విమర్శిస్తూ ఉండటంతో ఫోకస్ మొత్తం టీడీపీ మీదే ఉంది. వైసీపీ మీద ఆరోపణలు పెద్దగా ఎలివేట్ కావట్లేదు. అందరి మధ్యలోనూ తెలుగుదేశం బ్యాడ్ అయిపోతోంది. ప్రతిపక్షం బలహీనపడితే అందరికంటే ముందు లాభపడేది అధికారపక్షమే. సరిగ్గా అదే జరుగుతోంది ఇక్కడ. ఇరువైపుల దాడితో తెలుగుదేశం వీక్ అవుతోంది. ఫలితం వైసీపీ ఖాతాలో పడుతోంది. ఈ ఫలితంలో క్రెడిట్ బీజేపీకి కూడ ఉండాలి. కానీ పూర్తిగా వైసీపీకే పోతోంది. అంటే జగన్ను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం ఉన్న బీజేపీ తెలియకుండానే జగన్కు సహకరిస్తోంది.