Satellite Internet: ఇండియాలో ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్.. ధర ఎంతంటే?

భారత బ్రాడ్‌బ్యాండ్ రంగంలో కొత్త విప్లవానికి రంగం సిద్ధమవుతోంది. ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని స్టార్‌లింక్ సంస్థ, శాటిలైట్ ఇంటర్నెట్ సేవలతో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తరణకు వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందిస్తోంది. శాటిలైట్ ఆధారిత అపరిమిత డేటా సేవలను నెలకు రూ.840కే అందిస్తూ, తొలిదశలోనే కోటి మంది వినియోగదారులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

అయితే ఈ మార్గంలో పలు అడ్డంకులు ఉన్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రతిపాదించిన స్పెక్ట్రమ్ ఛార్జీలు, లైసెన్స్ ఫీజులు భారీగా ఉండటంతో, స్పర్ధాత్మక ధరలతో సేవలందించడం సవాలుగా మారనుంది. ఒక్క శాటిలైట్ స్పెక్ట్రమ్‌కు ఏడాదికి రూ.3,500, అలాగే 8 శాతం లైసెన్స్ ఫీజు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది.

ఇదిలా ఉండగా, స్టార్‌లింక్ టెక్నికల్ పరిమితుల కారణంగా తక్షణంలో పెద్ద మొత్తంలో వినియోగదారులకు సేవలందించడం కష్టం కావచ్చని ఐఐఎఫ్ఎల్ రీసెర్చ్ పేర్కొంది. ప్రస్తుతం ఆ సంస్థకు సుమారు 7,000 లో ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాలున్నా, వీటితో 40 లక్షల మందికే సేవలు అందించగలదు. 2030 నాటికి భారత్‌లో 15 లక్షల మందికే సేవలు అందే అవకాశముందని అంచనా.

అయినప్పటికీ, గ్రామీణ భారత్‌కి కనెక్టివిటీ విస్తరించే దిశగా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌ ప్రధాన భూమిక పోషించనుంది. ప్రస్తుతం ఫైబర్ నెట్‌వర్క్‌కి అలవాటు పడని అనేక మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇది ప్రత్యామ్నాయ మార్గంగా మారుతుంది. నియంత్రణ సమస్యలు, ఖర్చులు అధిగమిస్తే ఈ సేవలు భారత ఇంటర్నెట్ రంగాన్ని మార్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఖబర్దార్ మోడీ || OU Leaders Protest Against Operation Kagar || BJP Government || Telugu Rajyam