వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు నిత్యం ప్రజల్లోనే ఉండేవారు. ప్రజాసంకల్ప యాత్ర పేరుతో వందల కిలోమీటర్లు నడిచిన ఆయన ఎంతో మంది జనాన్ని కలుసుకున్నారు. దగ్గరుండి వారి సమస్యలను విన్నారు. అందుకే జనం జగన్ జగన్ అంటూ ఆయన్ను గెలిపించుకున్నారు. ఆయన అలా తమ మధ్య తిరుగుతుంటే జనం ఇంప్రెస్ అయ్యారు. కానీ ఇప్పుడు సీఎం అయ్యాక వైఎస్ జగన్ ను నేరుగా చూసి చాలా కాలమైంది అంటున్నారు ప్రజలు. వైఎస్ జగన్ పదవిని చేపట్టి ఇప్పటికే యేడాది గడిచిపోయింది. మొదట్లో ప్రభుత్వం, మంత్రివర్గం ఏర్పాటు, అన్ని శాఖల్లో కుదురుకోవడం లాంటి పనులతో బిజీ అయిన వైఎస్ జగన్ అన్నీ కుదురుకున్నాక కాస్త రిలాక్స్ అయ్యారు.
ఆతర్వాత సమయాన్ని పూర్తిగా పాలనకే వెచ్చించారు. అటు మీద కరోనా లాక్ డౌన్ కావడంతో ఇక ఎలాగూ ప్రజల్ని కలిసే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయనకు, జనానికి మధ్య గ్యాప్ పెరిగింది. ఇంతకుముందున్న నాయకులు ప్రజలకు, తమకు ఇలాంటి అంతరం లేకుండా జాగ్రత్తపడ్డారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజలను కలుస్తూ సమస్యలు విని వినతులు స్వీకరించేవారు. జగన్ తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయితే ప్రతి ఉదయం అధికారిక నివాసం వద్ద లేదా కార్యాలయం వద్ద ప్రజలను కలిసేవారు. చంద్రబాబు అయితే కరకట్ట వద్ద ప్రజావేదిక నిర్మించి ప్రజలకు సమయం కేటాయించారు. ఈ పనులతో వారు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు.
ఇప్పుడు వైఎస్ జగన్ మిస్ అవుతున్నది ఇదే. సీఎం అయ్యాక ఆయన ప్రజలకు దగ్గరగా రాలేకపోయారు. మొదట్లో ఆయన అలసత్వం చూపితే ఆ తర్వాత పరిస్థితులు ప్రతికూలంగా మారి ప్రజలకు దగ్గరగా వెళ్లనివ్వలేదు. కారణాలు ఏవైనా ఫలితం మాత్రం ఇబ్బందికరంగానే ఉంది. ప్రజలు సీఎం తమ వద్దకు రాలేకపోతున్నారు అనుకుంటుంటే ప్రత్యర్థులు జగన్ గెలిపించిన జనాన్ని మర్చిపోయారని విమర్శిస్తున్నారు. కాబట్టి పరిస్థితులు చక్కబడ్డాక వైఎస్ జగన్ మొదటగా ప్రజలకు దగ్గరగా వెళ్లే పని మొదలుపెట్టాలి. లేకపోతే ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శ కాస్త నిర్లక్ష్యం చేసేశారనే అపవాదుగా స్థిరపడిపోతుంది.