టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడలో కూల్చి వేసిన 9 గుడులను పునఃనిర్మించే పనులకు సీఎం జగన్ శుక్రవారం భూమి పూజతో ప్రారంభించారు. సంప్రదాయ పట్టు పంచలో నుదుటిన కుంకుమ, మెడలో కండువా వేసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భక్తిపారవశ్యమైన వాతావరణంలో మంగళవాయిద్యాలతో ఆలయాలకు భూమిపూజలు చేశారు. ముందుగా ఉదయం 11.01కి కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి.. అనంతరం అక్కడ నుంచి నేరుగా ఇంద్రకీలాద్రికి చేరుకొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తరువాత కనకదుర్గమ్మ అమ్మవారిని జగన్ దర్శించుకున్నారు. తదుపరి వేద పండితులు ఘనాపాటీలు ఆంజనేయ శర్మ , వివిఎల్ఎన్ ఘనాపాటి, వెంకటేశ్వర రావు, రామకృష్ణ ఆశీర్వచనాలు అందచేశారు.
అనంతరం దేవాదాయ శాఖ రాష్ట్రంలోని వివిధ ఆలయాలపై రూపొందించిన క్యాలండర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు , బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, సీఎం కార్యక్రమాల సమన్వయ కర్త తలశిల రఘురాం, బ్రాహణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, ఎమ్మెల్యేలు పార్ధసారధి, జోగి రమేష్, మేకా ప్రతాప్ వెంకట అప్పారావు, కైలే అనిల్ కుమార్, దేవాదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్, కమిషనర్ అర్జున రావు, కలెక్టర్ ఇంతియాజ్, సీపీ శ్రీనివాసులు, విఎంసి కమీషనర్ ప్రసన్న వెంకటేష్, జేసి మాధవీలత, సబ్ కలెక్టర్ ధ్యాన చంద్, దేవాదాయ అధికారి చంద్ర శేఖర్ ఆజాద్, ఆలయ ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
రాహు – కేతు ఆలయం, సీతమ్మ పాదాలు, (సీతమ్మ పాదాలకు సమీపంలోని దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలయం, శనైశ్చర ఆలయం, బొడ్డు బొమ్మ, ఆంజనేయస్వామి ఆలయం, దుర్గగుడి మెట్ల వద్ద సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ ఆలయం, పోలీసు కంట్రోల్ రూమ్ సమీపంలోని, వీరబాబు ఆలయం, కనకదుర్గ నగర్లో శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరమైన గోశాలకు సీఎం జగన్ భూమిపూజలు చేశారు.