ఆంధ్ర ప్రదేశ్: ఎట్టకేలకు నిన్న సుప్రీం కోర్టు తీర్పుతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల విషయంలో ఒక స్పష్టత వచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సమన్వయంతో ముందు కు సాగాలని సుప్రీం కోర్టు సూచించింది. రాజ్యాంగంలో ఎన్నికల నిర్వహణ ఒక కీలక పాత్రగా పేర్కొన్న సుప్రీం కోర్టు…ఈ విషయంలో పరస్పర సహకారం ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఇక ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి.
తాజాగా స్థానిక ఎన్నికలంటే జగన్ బయపడి పారిపోతున్నారని చంద్రబాబు విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఒక పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసాక స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ప్రజల చూపు అధికార ప్రభుత్వం మీదనే ఉంటుందని రాజకీయంగా ఏంతో అనుభవం ఉన్న బాబు గారికి తెలియదా? చరిత్ర తిరగేసినా ఇదే విషయం అర్ధమవుతుంది. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం మీద గ్రామస్థాయిలో మంచి అభిప్రాయమే ఉందని తెలుస్తుంది.
జగన్ ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలలో మంచి మార్కులు సంపాదించుకున్నారు. జగన్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ధీటుగా నిలబడతారనే నమ్మకాన్ని ఏపీలో ఇప్పుడున్న ఏ పార్టీ కూడా ప్రజలకి కలిగించలేదు. నచ్చిన పార్టీ కన్నా ఇప్పుడు అధికార పార్టీ అభ్యర్థుల్ని గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు లెక్కలేసుకుంటారు. ఆ విధంగా ఏ రకంగా చూసినా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో జగన్ కి తిరుగుండదని విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.