క్యాడర్ కు పవన్ సైలెంట్ బూస్ట్.. మంగళగిరిలో అసలేం జరిగింది..?

Pawan Kalyan during a Janasena political meeting

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనసేన పార్టీ వ్యూహాత్మకంగా వేసిన ఒక అడుగు.. ఇప్పుడు కూటమి రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత ఆత్మీయ సమావేశంలో ఒక అద్భుతమైన, అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు..

గత 2021 స్థానిక ఎన్నికల్లో వైకాపా అరాచకాలను, బెదిరింపులను ఎదుర్కొని ప్రాణాలకు తెగించి బరిలో నిలిచిన దాదాపు 1000 మంది జనసేన అభ్యర్థులను మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా పార్టీ ఘనంగా సత్కరించింది. సాధారణంగా గెలిచిన వారికే సత్కారాలు జరిగే రాజకీయాల్లో.. ఓడిపోయినా తెగువ చూపిన వారికి అగ్రతాంబూలం ఇవ్వడం వెనుక ఉన్న అసలు పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఏంటి..? ఇది టీడీపీకి ఎలా తలనొప్పిగా మారబోతోంది..?

రాబోయే స్థానిక పోరుకు ముందు జనసేన అధిష్ఠానం తీసుకున్న ఈ నిర్ణయం.. క్షేత్రస్థాయి క్యాడర్‌లో ఊహించని జోష్ నింపింది. రాజకీయంలో ఏ పార్టీ అయినా భవిష్యత్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలన్నా, తన బలాన్ని నిరూపించుకోవాలన్నా.. దానికి పునాది ఈ లోకల్ బాడీ ఎన్నికలే. అందుకే పవన్ కళ్యాణ్ ఎక్కడా అనవసర హడావుడి చేయకుండా.. చాలా సైలెంట్ గా, పక్కా ప్లానింగ్ తో తన క్యాడర్ కు ఒక పవర్ ఫుల్ బూస్ట్ ఇస్తున్నారు. కష్టకాలంలో పార్టీ జెండా మోసిన వారికి గుర్తింపు ఉంటుందనే బలమైన నమ్మకాన్ని ఈ కార్యక్రమం ద్వారా నాదెండ్ల మనోహర్ శ్రేణుల్లోకి పంపగలిగారు.

ఇది రాబోయే ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు మరింత పట్టుదలగా, భారీ సంఖ్యలో నామినేషన్లు వేయడానికి ఒక పెద్ద రూట్ మ్యాప్ లా పనిచేయబోతోంది. అయితే, పైకి అంతా ప్రశాంతంగా కనిపిస్తున్నా.. జనసేన అనుసరిస్తున్న ఈ సరికొత్త దూకుడు ధోరణి కూటమిలోని ప్రధాన భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద తలనొప్పిగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా టీడీపీ తమ్ముళ్లు మెజారిటీ స్థానాలను ఆశిస్తున్నారు.

‘మేము సీనియర్లం.. మాకే ఎక్కువ సీట్లు కావాలి’ అనే ధీమాలో టీడీపీ లీడర్లు ఉన్నారు. కానీ ఇప్పుడు జనసేన క్యాడర్ గతంలో కంటే రెట్టింపు ఉత్సాహంతో, తాము 2021 లో ఒంటరిగా పోరాడిన స్థానాలను తిరిగి తమకే కేటాయించాలని క్షేత్రస్థాయిలో పట్టుబట్టే వాతావరణం కనిపిస్తోంది. దీనివల్ల నియోజకవర్గాల వారీగా స్థానిక సీట్ల కేటాయింపులో కూటమిలోని ఇరు పార్టీల మధ్య గట్టి పోటీ తప్పేలా లేదు. పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా తమ పార్టీ బలాన్ని కేవలం పట్టణాలకే పరిమితం చేయకుండా.. గ్రామ స్థాయి నుండి, రూట్ లెవెల్ నుండి పెంచుకోవాలని చూస్తున్నారు.

స్థానిక సంస్థల్లో ఎంత ఎక్కువ మంది వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు ఉంటే.. భవిష్యత్తులో పార్టీ అంత బలమైన శక్తిగా ఎదుగుతుంది. ఈ విషయంలో నాదెండ్ల మనోహర్ గ్రౌండ్ లెవెల్ ఆపరేషన్‌ను అత్యంత పకడ్బందీగా నడిపిస్తున్నారు. మరి జనసేన ఇస్తున్న ఈ సైలెంట్ బూస్ట్‌ను తట్టుకుని.. క్షేత్రస్థాయిలో సీట్ల సర్దుబాటును చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది రాబోయే రోజుల్లో అత్యంత ఉత్కంఠభరితంగా మారబోతోంది. గెలిచిన వారినే కాకుండా.. ఓడిపోయినా జెండా మోసిన వారిని సత్కరించి గౌరవించిన జనసేన సరికొత్త రాజకీయ శైలిపై ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి.