వైఎస్ ఘాట్ వద్దకు షర్మిల, కారణం..?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహం నిశ్చయమైంది. అమెరికాలో వైద్యుడిగా స్థిరపడిన సోమల రఘురామ్ రెడ్డితో ఆమె ఏడడుగులు వేయబోతున్నారు. ఈ మేరకు వైఎస్సార్ కుటుంబ సభ్యులు పెళ్లి ముహూర్తాలను ఖరారు చేస్తూ అధికారికంగా వెల్లడించారు. వైఎస్ కుటుంబ ఆనవాయితీ ప్రకారం.. ఈ వివాహ వేడుకలకు సంబంధించిన తొలి లగ్గపత్రిక కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఉంచారు.

వైఎస్సార్ స్మృతి చిహ్నం వద్ద లగ్గపత్రికను ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. వైఎస్ అంజిలి రెడ్డిని వివాహం చేసుకోబోతున్న సోమల రఘురామ్ రెడ్డి ప్రస్తుతం అమెరికాలో డాక్టర్‌గా సేవలందిస్తున్నారు. ఆయన కుటుంబం కర్నూలు జిల్లాకు చెందినప్పటికీ, ప్రస్తుతం వారంతా యూఎస్‌లోనే స్థిరపడ్డారు. గతేడాది వైఎస్ షర్మిల కుమారుడు రాజా రెడ్డి వివాహం ఘనంగా జరగ్గా.. ఇప్పుడు కుమార్తె అంజిలి రెడ్డి కూడా పెళ్లి పీటలు ఎక్కుతుండటంతో వైఎస్సార్ కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది.

వైఎస్సార్ ఘాట్ వద్ద జరిగిన ఈ వేడుకలో వివాహ నిశ్చితార్థం, పెళ్లి తేదీలను ప్రకటించారు. ఈ నెల 24న వైఎస్ అంజిలి రెడ్డి, రఘురామ్ రెడ్డిల నిశ్చితార్థ వేడుక జరగనుంది. నవంబర్ 25న ఇరు కుటుంబాల సమక్షంలో అత్యంత వైభవంగా వివాహ మహోత్సవం జరగబోతోంది. డిసెంబర్ 5న బంధుమిత్రులు, రాజకీయ ప్రముఖుల కోసం భారీ ఎత్తున వివాహ రిసెప్షన్ వేడుకను నిర్వహించనున్నారు.