ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మంత్రి వర్గ విస్తరణ అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ఏపీ కేబినెట్లో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉండటంతో, ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే, ఈ రేసులోకి మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఊహించని విధంగా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా, ఆ పదవి తనకే కావాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
నిజానికి కేబినెట్లో ఖాళీగా ఉన్న ఆ ఒక్క మంత్రి పదవిని పొత్తుల సమీకరణాల్లో భాగంగా మొదట జనసేన పార్టీకి కేటాయించే అవకాశం ఉందనే ఊహాగానాలు గట్టిగా వినిపించాయి. మరోవైపు, తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, సామాజిక సమీకరణాల ఆధారంగా ఆ సీటు తమకే దక్కుతుందని ఆశపడ్డారు. టీడీపీ తరపున కూడా ఐదారుగురు బలమైన నేతల పేర్లు స్క్రీనింగ్లోకి వచ్చాయి. దీంతో ఈ ఇరు పార్టీల మధ్యే పోటీ ఉంటుందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా ఈ సమీకరణాల్లో సరికొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీలోని బీజేపి అధిష్ఠానం కూడా ఈ ఖాళీ పోస్టుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, ఢిల్లీ స్థాయిలో ఉన్న బలమైన పరిచయాలు, ఆర్థిక-రాజకీయ వ్యూహాల్లో సుజనా చౌదరికి ఉన్న పట్టును పరిగణనలోకి తీసుకుని, ఆయనకు ఏపీ కేబినెట్లో చోటు కల్పించాలని బీజేపీ పెద్దలు కూటమి పెద్దలకు సూచించినట్లు పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. అధిష్ఠానం నుంచి లభించిన ఈ సంకేతాలతోనే ‘ఆ మంత్రి పదవి నాకు కావాల్సిందే’ అని సుజనా చౌదరి తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే బీజేపి కోటాలో సత్యకుమార్ యాదవ్ కేబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు సుజనా చౌదరికి కూడా అవకాశం ఇస్తే బీజేపీకి రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. అయితే, మిత్రపక్షాల ఆకాంక్షలు, పార్టీలోని సీనియర్ల డిమాండ్లు, మరియు ఢిల్లీ పెద్దల సూచనల మధ్య సమతుల్యతను కాపాడుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ ఖాళీ పోస్టుపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.