జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సుమారు 25 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దూరం కావడం అటు కూటమి ప్రభుత్వంలోనే కాకుండా, ఇటు జనసేన అంతర్గత వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. పవన్ కల్యాణ్ కేరళలో ఆయుర్వేద చికిత్సలో ఉన్న ఈ కాలంలో.. పార్టీ యంత్రాంగం మొత్తం పరోక్షంగా ఒకే ఒక్కరి చేతిలోకి వెళ్ళిపోయిందనే విమర్శనాత్మక చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా సాగుతోంది. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీపై పూర్తి స్థాయి పట్టు సాధించారని, పవన్ లేని లోటును క్యాష్ చేసుకుంటూ పార్టీలో ‘వన్-మ్యాన్ షో’ నడిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ అంతర్గత సమీకరణాల్లో అత్యంత షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే.. పవన్ కల్యాణ్ సొంత అన్నయ్య, పార్టీ కీలక నేత అయిన కొణిదెల నాగబాబును కూడా ఈ వ్యవహారాలకు పూర్తిగా దూరం పెట్టడం. గతంలో పార్టీ ఐటీ వింగ్, రీజినల్ కోఆర్డినేషన్ కమిటీలతో యాక్టివ్గా ఉన్న నాగబాబు జోక్యం ఎక్కడా లేకుండా చాలా పక్కా వ్యూహంతో కొందరు పెద్దలు లైన్ క్లియర్ చేశారనే చర్చ జనసైనికుల్లో నడుస్తోంది. పవన్ కల్యాణ్ తర్వాత కుటుంబ సభ్యుల హవా సాగితే తమ ప్రాధాన్యత తగ్గుతుందనే ఉద్దేశంతోనే, నాగబాబును తెరవెనుకకు నెట్టేలా ఒక ప్రత్యేక కోటరీ ప్లాన్ చేసిందని పార్టీ సీనియర్లే గుసగుసలాడుకుంటున్నారు. దీనివల్ల పార్టీలో ఒకే ఒక్కడి ఇష్టారాజ్యం సాగుతోందనే అసంతృప్తి క్యాడర్ లో రోజురోజుకూ బలపడుతోంది.
మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు అత్యంత సీరియస్గా మారుతున్న తరుణంలో, క్షేత్రస్థాయి లీడర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు, టికెట్లు ఆశిస్తున్న నాయకులు తమ గోడు చెప్పుకోవడానికి పవన్ కల్యాణ్ను కలవలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అధినేత చుట్టూ ఉన్న ఒక బలమైన ఫిల్టరింగ్ బ్యాచ్.. కిందిస్థాయి నాయకులను కనీసం పవన్ దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కేవలం నాదెండ్ల మనోహర్ కనుసన్నల్లో ఉన్న వారికి, ఆయనకు నచ్చిన వారికి మాత్రమే ప్రాధాన్యత దక్కుతుండటంతో.. కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న పాత కాపులు ఇప్పుడు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. పవన్ కల్యాణ్ ఇప్పుడైనా మంగళగిరి వచ్చి ఈ అంతర్గత కోటరీ మాఫియాను బద్దలు కొట్టకపోతే, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు భారీ నష్టం తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.