వైసీపీకి తమ్మినేని సీతారాం గుడ్ బై..? జనసేన వైపు చూపు..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర రీజియన్‌లో మరో భారీ పొలిటికల్ ట్విస్ట్ చోటుచేసుకోబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం త్వరలోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో చేరే యోచనలో ఉన్నట్లు శ్రీకాకుళం జిల్లా రాజకీయ వర్గాల్లో బలంగా చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన, తన కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీలో అంతర్గత వర్గపోరు ఇప్పుడు పూర్తిగా రోడ్డుకెక్కింది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుల వైఖరిపై తమ్మినేని వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సర్వసభ్య సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్.. తమ్మినేని సీతారాం కుటుంబంపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో వేదికపైనే ఉన్న ధర్మాన సోదరులు ఆ వ్యాఖ్యలను కనీసం ఖండించకపోవడం తమ్మినేని కుటుంబానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

ఈ అంతర్గత అవమానాలు, విభేదాల వల్లే పార్టీలో ఇమడలేక తమ్మినేని బయటకు వచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదం ముదిరిన నేపథ్యంలో తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ సొంత పార్టీ నేతలపైనే బహిరంగంగా విరుచుకుపడ్డారు. “ధర్మాన సోదరులు పార్టీని నడిపిస్తున్న విధానం చూస్తుంటే రాబోయే రోజుల్లో శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్సీపీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా నేతలు కుల ప్రాతిపదికన రాజకీయం చేస్తున్నారని, తమ్మినేనికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దావానలంలా మారడంతో.. నష్టనివారణ కోసం తమ్మినేని సీతారాం స్వయంగా తాడేపల్లి వెళ్లి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. జగన్‌తో భేటీ అయినప్పటికీ జిల్లాలో ధర్మాన సోదరుల ఆధిపత్యం, స్థానిక నాయకత్వం నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా తమ్మినేని తీవ్ర అసహనంతో ఉన్నట్లు భోగట్టా. తన రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాప్‌లు ఉండవని, కామాలు మాత్రమే ఉంటాయని ఆయన కుమారుడు ప్రకటించడం వెనుక పార్టీ మార్పు సంకేతాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీలో తన సాంప్రదాయ ప్రత్యర్థి కూన రవికుమార్ ఉండటంతో అక్కడ ఛాన్స్ లేదని గ్రహించిన తమ్మినేని.. తన వారసుడి భవిష్యత్తు కోసం జనసేన పార్టీ అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు గట్టి టాక్ వినిపిస్తోంది. అంతా అనుకూలిస్తే త్వరలోనే కండువా మార్చేందుకు తమ్మినేని సిద్ధమవుతున్నారు.