ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన గత ప్రభుత్వ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ఊహించని మలుపులు తిరుగుతోంది. మనీలాండరింగ్ కోణంలో కూపీ లాగుతున్న ఈడీ అధికారులు.. ఇప్పటికే ఈ స్కామ్తో సంబంధం ఉన్న కీలక నేతలు, అధికారులను వరుసగా కటకటాల వెనక్కి నెట్టారు. ఇదే క్రమంలో తాజాగా మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. నోటీసుల అనంతరం ఆయనను కూడా అరెస్ట్ చేసేందుకు ఈడీ పూర్తిస్థాయిలో రంగం సిద్ధం చేసినట్లు ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ జరిపిన మెరుపు దాడులు, సుదీర్ఘ విచారణల అనంతరం కీలకమైన వ్యక్తులను ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్, ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ డి. వాసుదేవ రెడ్డి, ప్రముఖ మద్యం వ్యాపారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తదితరులు ఈ కేసులో ప్రధాన నిందితులుగా విజయవాడ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, బినామీ కంపెనీల ద్వారా భారీగా నిధుల మళ్ళింపునకు పాల్పడ్డారనే పక్కా ఆధారాలతోనే వీరందరినీ ఈడీ అరెస్ట్ చేసింది.
ఒకవైపు కారుమూరి నాగేశ్వరరావు అండ్ గ్యాంగ్ జైల్లో విచారణ ఎదుర్కొంటుండగానే.. ఇప్పుడు అంబటి రాంబాబు చుట్టూ ఈడీ ఉచ్చు బిగుస్తోంది. జైల్లో ఉన్న నిందితులు ఇచ్చిన వాంగ్మూలం మరియు డిజిటల్ ఆధారాల ప్రకారమే అంబటికి నోటీసులు అందినట్లు తెలుస్తోంది. ఈ విచారణలో గనుక ఆర్థిక లావాదేవీలపై సరైన సమాధానాలు రాకుంటే, జైల్లో ఉన్న మిగతా నేతల తరహాలోనే అంబటి రాంబాబు అరెస్ట్ కూడా ఖాయమనే సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ తాజా పరిణామం వైసీపీ శ్రేణుల్లో తీవ్ర కలవరాన్ని రేపుతోంది.