గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని విపక్షాలు, ప్రజలు “సకల శాఖా మంత్రి” అని పిలిచేవారు. అధికారికంగా ఎలాంటి మంత్రి పదవి లేకపోయినా, ప్రభుత్వంలోని అన్ని కీలక శాఖల నిర్ణయాలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు, పోలీస్ శాఖ సమీక్షలు సజ్జల కనుసన్నల్లోనే సాగాయనే విమర్శలు వెల్లువెత్తాయి. నాటి తెలుగుదేశం పార్టీ కూడా దీనిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. అయితే కాలం మారింది.. ఏపీలో ప్రభుత్వం మారింది.
కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో కూడా సరిగ్గా అదే సీన్ పునరావృతమవుతోందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా సాగుతోంది. ఐటీ, మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేశ్.. ప్రస్తుత ప్రభుత్వంలో మరో “సకల శాఖా మంత్రి”గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణే.. రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిన వినాయక నిమజ్జన వేడుకల డీజే వాహనాల అనుమతుల వ్యవహారం. వినాయక నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా రాష్ట్రంలో పోలీసులు డీజే వాహనాలకు పర్మిషన్లు ఇవ్వడం లేదని, కొన్నిచోట్ల వాహనాలను సీజ్ చేస్తున్నారంటూ ఉత్సవ నిర్వాహకులు, యువత నుంచి తనకు పెద్దఎత్తున సందేశాలు వచ్చాయని మంత్రి నారా లోకేశ్ స్వయంగా పేర్కొన్నారు.
అయితే, ఈ సమస్య పరిష్కారం కోసం ఆయన ఎంచుకున్న మార్గం ఇప్పుడు రాజకీయ వర్గాలను షాక్కు గురిచేస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు, పోలీస్ శాఖ పర్యవేక్షణ పూర్తిగా హోం మంత్రి వంగలపూడి అనిత చేతుల్లో ఉండాలి. కానీ, మంత్రి నారా లోకేశ్ నేరుగా తన అధికారిక ‘ఎక్స్’ వేదికగా హోం మంత్రి అనితను, అలాగే రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తాలను ట్యాగ్ చేస్తూ పబ్లిక్గా ఆదేశాలు జారీ చేశారు. డీజే వాహనాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా వెంటనే అనుమతులు ఇవ్వాలని, నిబంధనల పేరుతో ఒక్క డీజే వాహనాన్ని కూడా సీజ్ చేయకూడదని ఆయన స్పష్టం చేశారు.
లోకేశ్ చేసిన ఈ బహిరంగ ట్వీట్పై హోం మంత్రి వంగలపూడి అనిత కూడా తక్షణమే స్పందించారు. లోకేశ్ గారూ.. నిర్ణీత నిబంధనల ప్రకారం డీజే అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని పోలీస్ శాఖకు ఇప్పటికే అవసరమైన ఆదేశాలు జారీ చేశానంటూ ఆమె ట్విట్టర్ వేదికగానే రిప్లై ఇచ్చారు. అయితే ఒక ఐటీ శాఖ మంత్రి.. నేరుగా హోం శాఖ పరిధిలోకి వచ్చే అత్యంత సున్నితమైన శాంతిభద్రతల అంశంపై, అదీ నేరుగా పోలీస్ బాస్ అయిన డీజీపీని ట్యాగ్ చేస్తూ ఇలా బహిరంగంగా ఆదేశాలు ఇవ్వడం వెనుక ఉన్న రాజకీయం ఏంటనే చర్చ నడుస్తోంది.
హోం మంత్రిగా అనిత ఉన్నప్పటికీ, ఆమెను డమ్మీగా మార్చేసి తెరవెనుక లోకేశ్ తన అథారిటీని చూపిస్తున్నారని, నాడు సజ్జల రామకృష్ణారెడ్డి శాఖలను ఎలా శాసించారో నేడు లోకేశ్ కూడా అలాగే ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడిగా లోకేశ్కు పార్టీలో ఎంత ప్రాధాన్యత ఉన్నప్పటికీ.. ఇలా వ్యవస్థాగత పరిధులను దాటి వేరే శాఖలపై పట్టు కోసం ప్రయత్నించడం కూటమి ప్రభుత్వంలోని అంతర్గత ప్రజాస్వామ్యానికి, తోటి మంత్రుల ఆత్మగౌరవానికి దెబ్బతీసేలా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.