వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా, పార్టీ నంబర్-2గా సుదీర్ఘ కాలం వ్యవహరించిన మాజీ ఎంపీ వీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాయలసీమ వేదికగా అనంతపురంలో నిన్న ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన తన భవిష్యత్తు రాజకీయ వ్యూహాన్ని వెల్లడిస్తూ సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన “రాయలసీమ ఒరిజినల్ రెడ్ల పౌరుషం, ఆత్మగౌరవం” నినాదం ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ను షేక్ చేస్తోంది.
జగన్, చంద్రబాబు కుటుంబాలను టార్గెట్ చేస్తూ.. ఆ రెండు కుటుంబాల వల్ల రాయలసీమకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని, అందుకే సీమలో ఉన్న నిజమైన రెడ్లకు అండగా ఉండేందుకు తాను వస్తున్నానని, అందరూ కలిసి రావాలని విజయసాయి రెడ్డి పిలుపునిచ్చారు. పైకి ప్రాంతీయ అభివృద్ధి నినాదంగా కనిపిస్తున్న విజయసాయి రెడ్డి తాజా వ్యూహం వెనుక.. వైసీపీకి రాయలసీమలో అత్యంత పటిష్టమైన పునాదిగా ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని నిలువునా చీల్చే భారీ పొలిటికల్ స్కెచ్ ఉందనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.
రాయలసీమ జిల్లాలలో జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై, టికెట్ల కేటాయింపులపై ఎప్పటి నుంచో అసంతృప్తితో పొగబెగులుతున్న కీలక రెడ్డి సామాజిక వర్గ నేతలను, ద్వితీయ శ్రేణి నాయకులను విజయసాయి రెడ్డి తన వైపునకు తిప్పుకునే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ రాయలసీమలోని ప్రధాన ఓటు బ్యాంక్ అయిన ఈ క్యాడర్ గనుక చీలిపోతే, అది అంతిమంగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బ తీస్తుందని, ఆ అసంతృప్త వర్గాలు వైసీపీకి దూరమైతే పరోక్షంగా అధికార కూటమికి భారీ రాజకీయ మైలేజ్ లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అంతేకాకుండా, ఈ పరిణామం కేవలం ఓట్ల పరంగానే కాకుండా వైసీపీని ఆర్థికంగా కూడా చావుదెబ్బ కొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే, గత ఐదేళ్ల కాలంలో మరియు అంతకుముందు నుంచి వైసీపీకి రాయలసీమ రీజియన్కు చెందిన బలమైన పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, మరియు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బడా వ్యాపారవేత్తలే ప్రధాన ఆర్థిక వనరులుగా నిలిచారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి కొత్త ప్రత్యామ్నాయంగా రంగంలోకి దిగడంతో, ఆయా వర్గాలు జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వీడి విజయసాయి రెడ్డి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పార్టీకి వెన్నుముకలాంటి రెడ్డి సామాజిక వర్గంలో చీలిక రావడం, దానికి తోడు సీమ ఆర్థిక బలం కూడా చేజారిపోతే వైసీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని, ఈ పరిణామాలు కూటమి ప్రభుత్వానికి వ్యూహాత్మకంగా పెద్ద ప్లస్ పాయింట్ కాబోతున్నాయని పొలిటికల్ ల్యాండ్స్కేప్లో గట్టి చర్చ సాగుతోంది.