ఆంధ్రప్రదేశ్లో రాబోయే లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టింది. అయితే, క్షేత్రస్థాయి నుంచి అందుతున్న నివేదికలు చూస్తుంటే ఈ వ్యూహం కాస్తా ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 5 లక్షల వరకు కొత్త పింఛన్లను మంజూరు చేయాలని ప్రాథమికంగా భావించినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఏకంగా 11.50 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చి పడటంతో అధికార యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రత పింఛన్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. బుధవారం నాటికి వచ్చిన 11.50 లక్షల దరఖాస్తులలో అత్యధికంగా వృద్ధాప్య పింఛన్ల కోసమే 6 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత వితంతు కేటగిరీ కింద 2.61 లక్షలు, దివ్యాంగుల పింఛన్ కోసం 1.61 లక్షల మంది అప్లై చేసుకున్నారు. వీటితో పాటు చర్మకారులు, దప్పు కళాకారులు, మత్స్యకారులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు మరియు హిజ్రాల కేటగిరీల నుంచి కూడా వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.
అయితే, రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ పింఛన్ల పంపిణీ ప్రక్రియే ఇప్పుడు ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారనుంది. అనుకున్న లక్ష్యం కంటే రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు రావడంతో, కేవలం సగం మందికి మాత్రమే పింఛన్లు ఇచ్చి మిగిలిన వారిని పక్కన పెడితే క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం ఉంది. అర్హత ఉండి కూడా పింఛన్ అందుకోలేకపోయిన లబ్ధిదారులలో వచ్చే అసంతృప్తి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎన్నికల ప్రయోజనాల కోసం వేసిన ఈ పెన్షన్ల వ్యూహం, సరైన వడపోత మరియు పారదర్శకత లేకపోతే తిరిగి ప్రభుత్వానికే నెగటివ్గా మారే ఛాన్స్ ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.