ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సొంత పార్టీ శ్రేణులతో పాటు సాధారణ నెటిజన్ల నుంచి కూడా తీవ్ర విమర్శలకు, వెటకారాలకు దారితీస్తోంది. గణేష్ నిమజ్జనం వేడుకల్లో డీజే వాహనాలకు పోలీసులు పర్మిషన్లు ఇవ్వడం లేదంటూ మంత్రి లోకేష్ నేరుగా హోం మంత్రి అనిత, డీజీపీలకు ఎక్స్ వేదికగా బహిరంగ ఆదేశాలు జారీ చేశారు. డీజే వాహనాలను అస్సలు సీజ్ చేయవద్దంటూ ఆయన పెట్టిన ఈ పోస్టు సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు తెరలేపింది.
ఈ వ్యవహారంపై నెటిజన్లతో పాటు కొందరు సీనియర్ టీడీపీ సానుభూతిపరులు కూడా లోకేష్ ట్వీట్ను తీవ్రంగా తప్పుబడుతున్నారు. “అసలు దేశంలో 2000 సంవత్సరంలోనే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘నాయిస్ పొల్యూషన్ కంట్రోల్ రూల్స్’ అనేవి ఒకటి ఉన్నాయనే సంగతి ఇద్దరు మంత్రులలో ఎవరికైనా తెలుసా..?” అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. పోలీస్ శాఖ నిబంధనల ప్రకారం నడుచుకోవాలా లేక ఎక్స్ పోస్టులలో వచ్చే పొలిటికల్ ఆర్డర్ల ప్రకారం నడుచుకోవాలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఇక ఈ ట్వీట్కు హోం మంత్రి వంగలపూడి అనిత స్పందిస్తూ.. డీజే పర్మిషన్లను నిబంధనల ప్రకారం ప్రాసెస్ చేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చామని, ఉత్సవాలు ‘హిందూ ధర్మం’ యొక్క రీతినే ప్రతిబింబించాలని రిప్లై ఇవ్వడం మరో కామెడీగా మారింది. దీనిపై సీనియర్ విశ్లేషకులు స్పందిస్తూ.. “భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి వేడుకలకు, చెవులు పగిలిపోయేలా రికార్డు డాన్సుల పాటలతో పెట్టే డీజే సౌండ్లకు, అసలు హిందూ ధర్మానికి ఉన్న సంబంధం ఏంటో ఆ హోం మంత్రి గారికే తెలియాలి” అంటూ ఎద్దేవా చేస్తున్నారు. సొంత శాఖ కాని పోలీస్ డిపార్ట్మెంట్కు లోకేష్ ఇలా ఓపెన్గా హుకుం జారీ చేయడం, దానికి హోం మంత్రి డిఫెన్సివ్గా సమాధానం ఇచ్చుకోవడం చూస్తుంటే.. ప్రభుత్వంలో నిబంధనల కంటే ట్విట్టర్ పాలిటిక్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.