వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా వెలిగిపోవడానికి కారణం ఆయన అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు. పాలన ఆరంభించిన రోజు నుండే ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే పని మొదలుపెట్టారాయన. అందుకోసం వెనక ముందు ఆలోచించకుండా ఖర్చు పెట్టడం స్టార్ట్ చేశారు. అమ్మ ఒడి, గోరు ముద్ద, రైతు భరోసా, కాపు నేస్తం, వాహన మిత్ర, పింఛన్లు అంటూ దాదాపు అన్ని సామాజిక వర్గాలను కవర్ చేస్తూ నగదు బదిలీ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఉచిత పథకాల ద్వారా 3.9 కోట్ల మంది జనం లబ్ది పొందారు. ఇందుకోసం 40,000 కోట్లు వెచ్చించారు. ఇంకా నవరత్నాల్లో అమలుచేయాల్సిన పథాకాలు మిగిలే ఉన్నాయి. ఈ 40 వేల కోట్లు ఖర్చైంది ఒక్క యేడాదికే. ఇంకా నాలుగెళ్లు ఈ ఉచితాలు ఇస్తారు. మధ్యలో కొత్త పథకాలు చేరొచ్చు కూడ.
ఇలా ప్రతిదీ ఉచితం ఉచితం అంటూ చేతికి ఎముక లేకుండా జనం ఖాతాల్లోకి డబ్బు జమచేస్తూ ఉండటంతో జగన్ పాలన పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. పెట్టుబడులు, ఆదాయాలు రాష్ట్ర ఆదాయం, కేంద్రం నుండి రావలసిన నిధులు లాంటి లెక్కలు మెజారిటీ జనాలకు అవసరం లేదు కాబట్టి ఉచితాలు పొందుతున్న అందరూ జగన్ పాలనను చూసి చప్పట్లు కొట్టేస్తున్నారు. ఇది ప్రతిపక్షం టీడీపీకి నచ్చడంలేదు. జగన్ డబ్బు పంచుకుంటూ పేరు పెంచుకుంటూపోతే వచ్చే దఫాలో తమకు ఇప్పుడున్న 23 సీట్లు కూడా ఉండవని భయపడుతున్నారు. అందుకే జగన్ తన బలంగా భావిస్తున్న ఉచిత స్కీములను తిరిగి ఆయన మీదకే ఎక్కుపెట్టే పథక రచన చేశారు.
ఈ పథకంలో ప్రధాన ఉద్దేశ్యం అన్నీ ఉచితం ఉచితం అంటున్న జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని, ఆదాయం లేని ప్రభుత్వం యేడాదికి 50 వేల కోట్లు పంపకాలకే ఖర్చు పెడుతుంటే ఆర్థిక సంక్షోభం ఖాయమని, రాష్ట్రం అదోగతి పాలవుతుందని ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు. ఇప్పటికే ఎల్లో మీడియా ఎలాగూ ఇదే పనిలో ఉంది కాబట్టి సోషల్ మీడియా తెలుగు తమ్ముళ్లు ఈ బాధ్యతను తీసుకున్నారట. ఉచిత పథకాల వలన నష్టాలు ఏమిటో సరికొత్త తరహాలో కథనాలు వండుతున్నారు. చరిత్రలో ఇలాగే అన్నీ పంచుకుంటూ పోయి దివాళా తీసిన పాలనలను గురించి చెబుతున్నారు. ఈ ప్రచారం జగన్ పాలన పట్ల తటస్థ వైఖరిని కలిగిఉన్న వారిని టీడీపీ వైపుకు మళ్లించే అవకాశం లేకపోలేదు.