స్పెషల్ స్టేటస్ ని వదిలిపెట్టని వైయస్ జగన్..!!

Jagan hands over AP special status petition to Home Minister Amit Shah in recent meeting

ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్ర విభజన సమయంలో యుపీఏ ప్రభుత్వం ఆయిదేళ్ల పాటు ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చింది. ఆనాడు బీజెపీ నేతలు అయిదేళ్ళు కాదు పదేళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. నాడు పార్లమెంట్ లోనూ బయట వైసీపీ ప్రత్యేక హోదాకై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేసింది. నాడు ఎన్‌డీఏలో తెలుగుదేశం భాగస్వామిగా ఉండటంతో చంద్రబాబును ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రం ఒప్పించింది. పోలవరం ప్రాజెక్టు కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారంటూ వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శించింది. అనంతరం ఎన్టీఏ నుండి తెలుగుదేశం బయటకు వచ్చిన తరువాత ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున లేవనెత్తింది.

Jagan hands over AP special status petition to Home Minister Amit Shah in recent meeting
Jagan hands over AP special status petition to Home Minister Amit Shah in recent meeting

ఇక ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాము అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని కూడా ప్రజలకు వాగ్దానం చేశారు. ఏపిలో 25 పార్లమెంట్ స్థానాలకు గానూ 22 స్థానాలు వైసీపీ సాధించినా ప్రత్యేక హోదా గురించి కేంద్రంపై పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకురావడం లేదు. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే వైఎస్ జగన్ ప్రత్యేక హోదా విషయంలో తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. “కేంద్రం మనపై అధారపడి లేదు, ప్రాంతీయ పార్టీల సహకారం అవసరం లేకుండానే బీజెపీకి ఫుల్ ప్లెజ్డ్ మెజార్టీ ఉంది. మనం ప్రత్యేక హోదా కోసం గట్టిగా డిమాండ్ చేసి సాధించే పరిస్థితి లేదు, కానీ కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడుగుతూనే ఉంటాము” అని జగన్ చెప్పారు.

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బీజెపీ నేతలు చెబుతూనే ఉన్నారు. కేంద్రం కూడా ఈ విషయాన్ని పూర్తిగా పక్కడ పడేసింది. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో సహా ఇతర రాజకీయ పక్షాలు ప్రత్యేక హోదా ఊసు ఎత్తడం లేదు. కానీ జగన్ మాత్రం ఢిల్లీకి వెళ్లిన ప్రతి సారి కేంద్ర పెద్దలకు ఇతర అంశాలతో పాటు ప్రత్యేక హోదా గురించి ఓ వినతి పత్రాన్ని అందజేస్తూ ఉన్నారు. తాజాగా మంగళవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్ర అమిత్ షాతో భేటీలోనూ పోలవరం ప్రాజెక్టు బకాయిలు, పెరిగిన అంచనా వ్యయం తదితర అంశాలతో పాటు ఏపికి ప్రత్యేక హోదాపై వినతి పత్రం ఇవ్వడం గమనార్హం. ఉపయోగం లేదని తెలిసినా ప్రజలకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోటానికి సీఎం ఇలా పట్టు వదలని విక్రమార్కునిలా ప్రయత్నిస్తున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నారు.