రాష్ట్రంలో జగన్ వచ్చాక అమరావతిలో అభివృద్ధి ఆగిపోయింది అని విమర్శిస్తున్న ప్రతిపక్షాలకు గట్టి సమాధానం చెప్పాలనుకుంటున్నారు జగన్. అందుకే ప్రత్యేకంగా అమరావతి అభివృద్ధిపై ఫోకస్ పెంచారు. మూడు రాజధానుల్లో అమరావతి కూడా ఒకటి అని రుజువు చేయబోతున్నారు. రాజధాని అమరావతిలో కృష్ణా కరకట్ట రోడ్డుని నాలుగు వరుసల రహదారిగా విస్తరించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలులో పెట్టాలని, ఆ రోడ్డు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, అమరావతి ప్రాంత అభివృద్ధికి ఆ రోడ్డే కీలకంగా మారుతుందని సీఎం జగన్ పేర్కొనడం విశేషం. కరకట్ట రహదారిని ఆనుకుని ఉన్న రోడ్లనూ అభివృద్ధి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుతోపాటు, అమరావతిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు సీఎం కార్యాలయం తెలిపింది.
అదే సమయంలో కోర్టు కేసులతో మూడు రాజధానుల నిర్ణయం, కార్యాలయాల తరలింపు హోల్డ్ లో పడిపోయింది. అయితే విశాఖలో అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తూ జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ఉత్తరాంధ్రవాసులకు రాజధాని ఆశల్ని సజీవంగా ఉంచాయి. తాజాగా విశాఖ సముద్ర తీరంలో వాణిజ్య, నివాస భవనాల సముదాయం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత టీడీపీ ప్రభుత్వం లులూ గ్రూప్ కి కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకున్న వైసీపీ సర్కారు, అదే స్థలంలో ఇప్పుడు భారీ నిర్మాణాలకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి జాతీయ భవన నిర్మాణ సంస్థ(ఎన్.బి.సి.సి.) ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసింది. అక్కడ వాణిజ్య, నివాస భవన సముదాయాల్ని నిర్మిస్తే ప్రభుత్వానికి రూ.1,450 కోట్ల ఆదాయం వస్తుందని ఎన్.బి.సి.సి. సూచించింది. సీఎం జగన్ ఇలా ఒకేసారి రెండు ప్రాంతాల ప్రజలను ప్రసన్న చేసుకోవటానికి భారీ ప్లాన్ వేశారనిపిస్తుంది.