రేవంత్ రెడ్డిని జీవితాంతం మాజీ ఎమ్మెల్యేగానే ఉంచుతా

కొడంగల్ లో రేవంత్ రెడ్డికి ఎదురే లేదు అనుకుంటున్నవేళ టిఆర్ఎస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతున్నది. రేవంత్ ను ఢీకొట్టేందుకు అన్నిరకాలుగా పార్టీని బలోపేతం చేస్తున్నది. 

కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలానికి చెందిన రేవంత్ అనుచరులంతా టిఆర్ఎస్ గూటికి చేరారు. వారి చేరికతో దౌల్తాబాద్ మండలంలో రేవంత్ రెడ్డి సైన్యం ఖాళీ అయిందని ప్రకటించారు టిఆర్ఎస్ కొడంగల్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి. 

మంగళవారం దౌల్తాబాద్ మండలంలోని తిమ్మిరెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వంద మంది టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికీ పట్నం నరేందర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. 

టిఆర్ఎస్ లో చేరిన రేవంత్ మనుషులు

ఈ సందర్భంగా పట్నం మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ని జీవితమంతా మాజీ ఎమ్మెల్యేగానే ఉంచుతానని హెచ్చరించారు. కొడంగల్ లో ప్రజల నుంచి వచ్చే ఆదరణ చూస్తూంటే నూటికి నూరు శాతం గులాబీ జెండ ఎగరడం ఖాయం అన్నారు.

ఈ సందరభంగా పార్టీలో చేరిన వారంతా నరేందర్ రెడ్డి ని సుమారు 50000 మెజారిటీతో అసెంబ్లీ కీ పంపుతాం అని హామీ ఇచ్చారు.  రేవంత్ రెడ్డి ని ఓడించి కొడంగల్ నియోజకవర్గం నుంచి తరిమికొట్టడమే మా లక్ష్యం అని అన్నారు కార్యకర్తలు. కార్యక్రమం లో కోట్ల మహిపాల్  ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.