జాతీయ పార్టీలకు అంత జ్ఞానం ఎక్కడుంది, కవిత షాకింగ్ కామెంట్స్

 

దేశాన్ని తామే పరిపాలించాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు టిఆర్ ఎస్ నిజామా బాద్ ఎంపి కల్వకుంట్ల కవిత చురుక్కుమనిపించే చురకలంటించారు.

దేశాన్ని కొత్త దిశలో నడిపించేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పాటుచేసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్న ప్రయోగాన్ని విమర్శించే జాతీయ పార్టీలకు ఆమె దీటైన సమాధానమిచ్చారు. ప్రాంతీయ పార్టీలు మరీ లోకల్ అని, జాతీయ సమస్యలు, జాతీయ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ వ్యవహారాలు ప్రాంతీయ పార్టీలకు వాటికి అంతగా అర్థం కావనేది ప్రాంతీయ పార్టీల కూటమి ప్రస్తావన వచ్చినపుడల్లా వినపడే విమర్శ.

ఈ విమర్శను ప్రస్తావిస్తూ ఇది డొల్ల అని చెప్పారు. టైమ్సాఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో జాతీయ పార్టీలు ఎక్కడెక్కవ విఫలమయ్యాయో ఎండగట్టారు.

‘‘అమేధీ నుంచి గెల్చిన రాహుల్ గాంధీ, వారణాసి నుంచి గెల్చిన నరేంద్ర మోదీకి జాతీయ సమస్యలు బాగా అర్థమవుతాయి. ఎక్కడో తెలంగాణ నుంచి వచ్చిన మనిషికి ఈ సమస్యలేం అర్థమవుతాయనేది వారి వాదన. మరి వాళ్లకి జాతీయ సమస్యలు అంత బాగా అర్థమయి ఉంటే ఇరుగు పొరుగు దేశాలతో ఇన్ని సరిహద్దు సమస్య లెందుకు ఉన్నాయి. పాకిస్తాన్ టెర్రరిజం సమస్య ఎందుకు తెగుడు పడటంలేదు.చైనాతో జలాలపంపకం, సెక్యూరిటీ సమస్యలు ఎందుకు సెటిల్ కావడం లేదు. అంతర్జాతీయ సమస్యల మీద అంత మంచి అవగాహన ఉంటే, ఐక్య రాజ్య సమితి సెక్యూరిటీ  కౌన్సిల్ లో  శాశ్వత సభ్యత్వం ఎందుకు తెచ్చుకోలేక పోతున్నారు. దేశాన్ని తామే ఏలగలం అనుకుంటున్న బిజెపి కాంగ్రెస్ లు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వాల  రాష్ట్రాల వ్యవహారాలలో తలదూర్చుడం మానుకోవాలి. తెలంగాణలో ఉన్న ఆసుపత్రిలో, నాగాలాండ్ లో ఉన్న స్కూళ్లో కూడా జోక్యం చేసుకోవాలనుకుంటారు. మొదట దేశాన్నంతా ప్రభావితం చేసే ఆర్థిక వ్యవహారాలలో గోప్యం లేకుండా పారదర్శకంగా ఉండండి. బ్రహ్మపుత్ర జలాల పంపకం గురించి  ప్రజలకు వివరించండి. దేశ సమస్యలను పరిష్కరించేందుకు బిజెపికి, కాంగ్రెస్ కు కావాలసిన సమయం ఇచ్చారు. ఆ రెండుపార్టీలు ఫెయిలయ్యాయి. ఇక చాలు, ప్రజలు ప్రత్యామ్నాయం కోరుతున్నారు.

అంతేకాదు, ప్రాంతీయ పార్టీ లన్నీ కుటుంబ సంస్థలని ప్రధాని నరేంద్ర మోదీ తరచూ  విమర్శను కూ డా ఆమె చక్కగా తిప్పికొట్టారు.

 బిజెపి ని నడిపించేది కూడా ఒక కుటుంబమే( సంఘ్ పరివారం) ఈ కుటుంబ సిద్ధాంతా ఎంత విఛ్చిన్నకరమయిందో తెలిసిందే. ప్రాంతీయ పార్టీలేవీ ఇలాంటి ‘పరివార్ ’ దర్శకత్వంలో నడిచేందుకు సిద్ధంగా లేదు.

ప్రాంతీయ పార్టీలలోని కుటుంబాలను ప్రజలు ఎన్నుకున్నారు. గెల్చాక చూడాల్సింది కుటుంబాలను కాదు, వాటి పనితీరును. జాతీయ పార్టీ నేతల వన్నె తగ్గింది. అవేవి జాతీయ పార్టీలు కాదు. వాటి ప్రభుత్వాలన్నీ కేవలం ఒకే ఒక వ్యక్తి చుట్టూ తిరిగేవే.