సాయి ధరమ్ తేజ్ ఇప్పుడెలా వున్నాడంటే..

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాద దృశ్యాలు, అనంతరం ఆసుప్రతికి తరలిస్తున్న సమయంలో తీసిన ఫొటోలు, ఆసుపత్రిలో తొలి రోజు తీసిన ఓ వీడియో తప్ప, ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్‌కి సంబంధించి ఎలాంటి ఫొటో, వీడియో బయటకు రాలేదు.

తాను కోలుకున్నట్టు ఓ ఫొటో మాత్రం సాయి ధరమ్ తేజ్ చాన్నాళ్ళ తర్వాత పోస్ట్ చేశాడు. అందులో కూడా సాయి ధరమ్ తేజ్ బొటన వేలు (థంబ్) మాత్రమే కనిపించింది. ఇటీవల హరీష్ శంకర్, సాయి ధరమ్ తేజ్‌ని కలిసి, ఇద్దరూ చేతులు కలిపిన ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

తేజు పూర్తిగా కోలుకున్నాడని కుటుంబ సభ్యులు (మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్) చెబుతూ వస్తోన్న విషయం విదితమే. హరీష్ శంకర్ కూడా అదే మాట చెప్పాడు. అయితే, అభిమానుల్లో మాత్రం ఆందోళన చల్లారడంలేదు. ఇంతకీ, తేజుకి సంబంధించి ఓ ఫొటో లేదా ఓ వీడియో ఎందుకు విడుదల చేయడంలేదు.?

ప్రమాదం నుంచి తేజు కోలుకున్నా, అది పెద్ద ప్రమాదమే. షాక్ చాలా గట్టిగానే తగిలింది తేజుకి. దాన్నుంచి కోలుకోవడం అంత తేలిక కాదు. మరోపక్క, తేజుకి పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు చెబుతుండడంతో, అతనిపై ఎలాంటి ఒత్తిడీ లేకుండా చేస్తున్నారు కుటుంబ సభ్యులు.

త్వరలో, అతి త్వరలో తేజు, అభిమానుల ముందుకు వచ్చే అవకాశముందట. జస్ట్, ఇంకో వారం పది రోజుల్లోనే.. అంటూ తేజు సన్నిహితుల నుంచి సమాచారం అందుతోంది.