పేరు మారింది.. కొత్త బ్యానర్ పుట్టింది.! ఏంటి తేజూ ఇదంతా.!

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రాణాలతో కొట్టుమిట్టాడి.. ఎలాగైతేనేం, బతికి బట్టగట్టాడు సాయి ధరమ్ తేజ్.! నిజంగానే, అతనికిది పునర్జన్మ. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, హీరోగా టాలీవుడ్‌లో మంచి మార్కెట్టే సంపాదించుకున్నాడు. కానీ, ఏమయ్యిందో.. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్‌తో డీలా పడ్డాడు.

మొన్నీమధ్యనే ‘విరూపాక్ష’తో హిట్టు కొట్టాడుగానీ, మళ్ళీ కెరీర్ స్లో అయ్యింది. ‘బ్రో’ సినిమాలో చిన్న మావయ్య పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించాడు సాయి ధరమ్ తేజ్. ‘గాంజా శంకర్’ పేరుతో ఓ సినిమా చేయాల్సి వుంది. అది ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై సాయి ధరమ్ తేజ్ ఏ విషయమై చెప్పడంలేదు.

కాగా, సాయి ధరమ్ తేజ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ కొత్త బ్యానర్ స్థాపించాడు. తల్లి విజయ దుర్గ పేరు మీద నిర్మాణ సంస్థని ప్రారంభించి మేనమామల నుంచి ఆశీస్సులు కూడా తీసుకున్నాడు సాయి ధరమ్ తేజ్.

అన్నట్టు, తన పేరులోని ధరమ్‌ని కాస్తా, ‘దుర్గ’గా మార్చేసుకున్నాడు. అంటే, ఇకపై సాయి ధరమ్ తేజ్ కాదు, సాయి దుర్గ తేజ్ అన్నమాట. పంజా సాయి దుర్గ తేజ్.!

కొన్నాళ్ళ క్రితమే సాయి ధరమ్ తేజ్ పేరు మార్చుకున్నాడు. అతని సినిమాల్లో అతని పేరుని ‘సాయి తేజ్’గా మాత్రమే పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడేమో, మధ్యలోకి, ‘దుర్గ’ వచ్చి చేరిందంతే. జాతక రీత్యా ఈ పేరు మార్పు జరిగినట్లు తెలుస్తోంది. దానికి ‘అమ్మ’ సెంటిమెంట్ భలేగా తగిలించాడు తేజ్.

మెగా కాంపౌండ్‌లో బ్యానర్లు చాలానే వున్నాయ్. అంజనా ప్రొడక్షన్స్, కొణిదెల ప్రొడక్షన్స్, ఇవి కాకుండా చిరంజీవి కుమార్తెలు స్థాపించిన బ్యానర్స్, నిహారిక చేతిలో ఓ బ్యానర్.. ఇప్పుడేమో కొత్తగా సాయి ధరమ్ తేజ్ బ్యానర్.! ఈ కొత్త బ్యానర్ల వెనుక మతలబు ఏంటబ్బా.? ఏమో మరి.!