తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజురోజుకూ క్షీణించడమే తప్ప మెరుగవుతున్న సూచనలు కనిపించడం లేదు. పార్టీలో ఏ మూలనా హుషారు లేదు. ఏ వైపు నుండీ గొప్ప కదలిక రావడంలేదు. పార్టీలో ఏ స్థాయి నేతల్ని కదిలించినా ఒకటే బాధ. చంద్రబాబు ఎప్పుడొస్తారు, దిశా నిర్దేశం ఎప్పుడు చేస్తారు. ఇన్నాళ్లు కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్టు మౌనంగానే వ్యవహరించిన నేతలు ఇక లాభం లేదని మనసులో మాటల్ని బయటికి కక్కేస్తున్నారు. ఒకప్పుడు గ్రౌండ్ లెవల్లో బలమైన పునాదులు, క్యాడర్ కలిగిన టీడీపీకి గత రెండు మూడేళ్లలో అవే బలహీనమయ్యాయి. ఇదివరకు తెలుగుదేశం అంటే చిన్నా, పెద్ద, ఆడ, మగ, కులం, మతం అనే తేడా లేకుండా అన్ని వర్గాల్లోనూ మంచి గుర్తింపు ఉండేది. అందరికీ టీడీపీ అంటే ఒక శుభప్రదమైన సెటిమెంట్ ఉండేది. ఇప్పుడు అదే లోపించింది.
ఎవ్వరూ పెద్దగా పార్టీ గురించి పట్టించుకోవట్లేదు. చంద్రబాబు ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా ప్రజల్లోకి బలంగా వెళ్లలేకపోతోంది. కారణం అనుబంధ సంఘాలు చెల్లాచెదురైపోవడమే. ఒకప్పుడు టీడీపీకి అనేక అనుబంధ సంఘాలు ఉండేవి. అవెప్పుడూ చురుగ్గా పనిచేస్తూ ఉండేవి. నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీని వారికి చేరువ చేసేవి. తెలుగు యువత, తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్, తెలుగు యువత, తెలుగు రైతు, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఇలా అనేక అనుబంధ సంఘాలు చురుగ్గా పనిచేసేవి. నిత్యం ఏదో ఒక కార్యక్రమం నిర్వహించేవారు. పార్టీలోని నియోజకవర్గ ఇన్ ఛార్జులు, ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి లీడర్లతో నిత్యం సంబంధాలు కలిగి ఉండేవి. కానీ గత కొన్నాళ్ళుగా ఆ పరిస్థితి లేదు.
ఏమరపాటో లేకపోతే వాటి వలన పెద్దగా ప్రయోజనం లేదనుకున్నారో తెలీదుకానీ చంద్రబాబు నాయుడు వారిని నిర్లక్ష్యం చేశారు. ఎవ్వరికీ పెద్దగా బాధ్యతలు ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో ఆ సంఘాలను సమర్థవంతంగా వినియోగించుకోలేదు. దీంతో పార్టీ ఘోర పరాజయం పాలైంది. తెలుగు తమ్ముళ్ల అభిప్రాయం ప్రకారం ఉన్న సంఘాలన్నింటినీ సక్రమంగా వినియోగించుకుని ఉంటే ఓడినా మరీ 23 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యేంత దారుణంగా ఓడిపోయేవారం కాదని అంటున్నారు. సరే జరిగిన నష్టమేదో జరిగిపోయింది.. ఇకనైనా చంద్రబాబు మేలుకున్నారా అంటే అదీ లేదు. కరోనా పేరుతో హైదరాబాద్ నగరానికే పరిమితమయ్యారు. ఈ విషయంలో పార్టీ నేతలు అందరూ గుర్రుగానే ఉన్నారు. ఇకమీదట కూడ అలాగే ఉంటే పార్టీ మరింత దెబ్బతింటుందని అంటున్నారు. ఇకనైనా మేలుకుని పార్టీకి సంబంధించిన అన్ని అనుబంధ సంఘాలకు సమర్థులైన నాయకులను నియమించి సరైన దిశా నిర్దేశం చేస్తే తప్పకుండా పుంజుకోగలమని, రెట్టింపు కష్టం చేస్తే వచ్చే దఫాలో చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునే అవకాశాలు లేకపోలేదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ అమూల్యమైన సలహాను చంద్రబాబు అనుసరిస్తారో లేదో చూడాలి.