Pegasus Row : సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అనూహ్యంగా మీడియా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ సర్కారు పెగాసస్ అంశాన్ని సీరియస్గా తీసుకున్నట్లే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్, పెగాసస్ మీద హౌస్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు కూడా.
ఈ తరుణంలో ఏబీ వెంకటేశ్వరరావు ఎందుకు మీడియా ముందుకొచ్చారన్నదే ఆసక్తికరమైన అంశం. ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్గా వున్నప్పుడే పెగాసస్ కొనుగోలు జరిగిందన్నది ప్రధానమైన ఆరోపణ. అయితే, ఆయన మాత్రం అసలు అలాంటి కొనుగోళ్ళు ఏమీ జరగలేదని చెబుతున్నారు. చంద్రబాబు హయాంలోగానీ, వైఎస్ జగన్ హయాంలోగానీ పెగాసస్ కొనుగోలు జరగలేదని ఏబీవీ చెప్పడం గమనార్హం.
అయితే, ఏబీవీ మాటల్ని నమ్మడానికి వీల్లేదనీ, ఆయనే ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి అనీ, రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టడానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలోనే ఈ కుట్ర జరిగిందనీ, దానికి ఏబీ వెంకటేశ్వరరావు సహకరించారనీ వైసీపీ ఆరోపిస్తోంది.
పోలీస్ అధికారిలా కాకుండా, తెలుగుదేశం పార్టీ నాయకుడిలా ఏబీవీ వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా వుంటే, పెగాసస్ కొనుగోలు జరగలేదని వైసీపీ హయాంలో డీజీపీగా పని చేసి ఇటీవల పదవీ విరమణ పొందిన గౌతమ్ సవాంగ్..
తాను అధికారిగా వున్న సమయంలోనే పేర్కొనడం గమనార్హం.