ఎన్టీఆర్‌ను కలిసిన అనుపమ్‌ ఖేర్‌.. సోషల్‌ మీడియాలో ఫోటో షేర్‌!

‘వార్‌2’ షూటింగ్‌తో ఎన్టీఆర్‌ బిజీగా ఉన్నారు. దీని చిత్రీకరణ కోసం ఆయన ముంబయిలో బస చేసిన ఎన్టీఆర్‌ ఇటీవల అక్కడి స్టార్స్‌ పార్టీలోనూ ఈ హీరో సందడి చేశారు. తాజాగా సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఆయనను కలిశారు. తారక్‌తో దిగిన ఫొటోను సోషల్‌ విూడియాలో పంచుకున్నారు. తన అభిమాన నటుడైన జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలవడం ఆనందంగా ఉందన్నారు. ఆయన పనిచేసే విధానం తనకెంతో ఇష్టమని ప్రశంసించారు. ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ పోస్ట్‌పై తారక్‌ స్పందించారు. ‘నన్నెప్పడూ మెచ్చుకునే విూ పనితీరు కూడా మాటలకందనిది. భవిష్యత్తు తరాలకు విూరు స్ఫూర్తినిస్తూనే ఉండాలని కోరుకుంటున్నా’’ అని రాసుకొచ్చారు.

ఈ ఫొటోను షేర్‌ చేస్తోన్న అభిమానులు.. ‘ప్రశాంత్‌ నీల్‌`ఎన్టీఆర్‌ కాంబోలో రానున్న చిత్రంలో అనుపమ్‌ఖేర్‌ నటిస్తున్నారా?’ అని కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరేమో ‘వార్‌2’లో ఆయన ఉన్నారని భావిస్తున్నారు. ప్రస్తుతం తారక్‌ ‘దేవర’లో నటిస్తున్నారు. దీని షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం పాటలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామా ఇది.

ఈ చిత్రంతో జాన్వీ తెలుగు తెరకు పరిచయమ వుతుండగా, సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ చిత్రం మొదటి పార్ట్‌ను అక్టోబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు బాలీవుడ్‌లో హృతిక్‌ రోషన్‌ హీరోగా రూపొందుతోన్న ‘వార్‌2’లోనూ ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో బాలీవుడ్‌తోపాటు వరల్డ్‌వైడ్‌గా ఫ్యాన్‌ బేస్‌ సంపాదించుకున్నాడు జూనియర్‌ ఎన్టీఆర్‌.