కైకేయిగా లారాదత్తా అంటూ ప్రచారం.. రామాయణంలో అవకాశం వస్తే తప్పక నటిస్తానని వెల్లడి!

బాలీవుడ్‌ సినీ ప్రముఖులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో ఇది రానుంది. ఈ చిత్రంలోని నటీనటుల ఎంపికపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాకపోయినా సోషల్‌ విూడియాలో రకరకాల పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి.

తాజాగా తాను కైకేయి పాత్రలో నటించనున్నట్లు వస్తోన్న వార్తలపై బాలీవుడ్‌ నటి లారా దత్తా స్పందించారు. ‘రామాయణ’పై వస్తోన్న చాలా రూమర్స్‌ నేనూ వింటున్నాను. వాటి గురించి పట్టించుకోవట్లేదు. కానీ, వాటిని వినడం నాకు ఆనందాన్నిస్తుంది. ఎందుకంటే అంత గొప్ప సినిమాలో నటించాలని అందరూ కోరుకుంటారు. అవకాశమిస్తే అందులోని చాలా పాత్రలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.

శూర్పణఖ, మండోదరి, కైకేయి.. వీటిల్లో ఏ పాత్ర ఇచ్చిన నేను పోషిస్తాను’ అని చెప్పారు. ఇక ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ , సీతగా సాయి పల్లవి , రావణుడిగా యశ్‌, హనుమంతుడి పాత్రలో సన్నీ డివోల్‌, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కనిపించనున్నట్లు జోరుగా ప్రచారమవుతోంది. ఇప్పటికే దీని చిత్రీకరణ ప్రారంభమైందని కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

వాటిపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది. భారీ బడ్జెట్‌తో సిద్ధం కానున్న ఈ చిత్రానికి ‘కేజీఎఫ్‌’ హీరో యశ్‌ సహ నిర్మాతగానూ వ్యవహరించనున్నారు. సినిమాకు ఎంతో ముఖ్యమైన సంగీతం కోసం మూవీ యూనిట్‌ ఆస్కార్‌ విజేతలను సెలక్ట్‌ చేసుకున్నట్లు సమాచారం. ఏఆర్‌ రెహమాన్‌తో పాటు హాలీవుడ్‌ ఫేమస్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ హన్స్‌ జిమ్మెర్‌ దీనికి ట్యూన్స్‌ అందించనున్నట్లు తెలుస్తోంది. మూడు భాగాలుగా దీన్ని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. మొదటి పార్ట్‌ను 2025 దీపావళికి తీసుకురావాలని ప్లాన్‌ చేస్తున్నారు.