పరిశ్రమలో తగినంత గుర్తింపు రాలేదంటోంది ఇలియానా!!

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా అగ్ర కథానాయకుల సరసన అలరించారు ఇలియానా. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”తాను నటించిన ఓ బాలీవుడ్‌ చిత్రం తర్వాత దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయన్నారు. 2012లో అనురాగ్‌ బసు దర్శకత్వంలో తెరకెక్కిన ‘బర్ఫీ’లో ప్రధానపాత్ర పోషించాను. అప్పటికే నేను దక్షిణాదిలో ఫుల్‌ బిజీ. ‘బర్ఫీ’ కథ చాలా నచ్చింది. అలాంటి చిత్రాల్లో అవకాశాలు అరుదుగా వస్తాయనిపించింది. దాన్ని వదులుకోవడం తెలివి తక్కువతనంగా భావించాను. అందుకే ఓకే చేశా. అనుకున్నట్లుగానే అది ప్రేక్షకాదరణ పొందింది. దీంతో అందరూ నేను దక్షిణాదిని వదిలేసి బాలీవుడ్‌కు మకాం మార్చానని అనుకున్నారు. ఇక సౌత్‌ ఫిల్మ్స్‌లో నటించనని భావించారు. ఆ అపోహతోనే నాకు అవకాశం ఇచ్చేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపలేదు. బాలీవుడ్‌కు వెళ్లాక నేను సినిమాలు ఎంపిక చేసే విధానంలో మార్పు వచ్చింది. చాలా సెలక్టివ్‌గా వ్యవహరించా. ఏ పని అయినా నిజాయితీగా చేస్తా. నా పాత్రకు వందశాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. కానీ పరిశ్రమకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. నాకు రావాల్సిన గుర్తింపు రాలేదనిపిస్తుంది. దానికి కారణం కూడా తెలీదు”అని చెప్పారు.

తాజాగా ఇలియానా ‘దో ఔర్‌ దో ప్యార్‌’తో ప్రేక్షకులను పలకరించారు. విద్యాబాలన్‌, ప్రతిక్‌ గాంధీలు ఇందులో కీలకపాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన ఈ రొమాంటిక్‌ కామెడీ డ్రామా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ అందుకుంది. కొన్ని నెలల క్రితం ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చి మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది.