వైసీపీ నేతల్లో చంద్రబాబు నాయుడంటే ఒంటికాలు మీద లేచే నేత కొడాలి నాని. చంద్రబాబు మీద ఈయనకున్న కోపం అంతా ఇంతా కాదు. తాను చంద్రబాబును తిడుతూనే ఉంటానని, ఆపనని కొడాలి నాని అన్నారంటే ఆయనలో బాబుగారి మీద కోపం ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. బాబుతో మొదలుపెడితే లోకేష్ మీదుగా వెళ్ళి టీడీపీలోని పెద్ద తలలన్నింటి మీద మొట్టికాయలు వేసొస్తారు నాని. నాని మొదటి నుండి చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి శత్రువేమీ కాదు. అసలు ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైందే టీడీపీలో. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున గుడివాడ ఎమ్మెల్యేగా గెలిచిన నానికి హరికృష్ణ, జూ. ఎన్టీఆర్ అంటే అమితమైన అభిమానం. హరికృష్ణ తన రాజకీయ గురువని, తారక్ సోదరుడితో సమానమని అనేకసార్లు అన్నారు.
మరి అలాంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు, టీడీపీల మీద ఈ స్థాయిలో ధ్వజమెత్తడానికి కారణం ఏమిటయా అంటే గతం గుర్తుచేసుకోండి అంటున్నారు పరిశీలకులు. కొడాలి నాని పార్టీలో చేరిన చాలా ఏళ్లు పార్టీకి విధేయుడిగానే ఉన్నారు. కానీ 2009లో కూడ పార్టీ ఓడిపోయాక పరిస్థితులు మారాయి. చంద్రబాబు సహా మిగతా కీలక నేతలందరితోనూ నానికి విబేధాలు ఏర్పడ్డాయి. 2012 నాటికి అవి తారా స్థాయికి చేరుకున్నాయి. పార్టీకి నాని దూరం జరుగుతూ వచ్చారు. ఇది గమనించిన చంద్రబాబు, కృష్ణా జిల్లా టీడీపీ నేతలు అప్పటికే రెండుసార్లు గెలిచిన నానికి ప్రత్యామ్నాయం సిద్దం చేయాలని అనుకున్నారు. అందుకే నాని వ్యతిరేక వర్గమైన రావి వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పార్టీలోకి లాగాలని అనుకున్నారు.
కానీ నాని ఊపు ముందు నిలవలేనని రావి చెప్పగా బాబు బాలకృష్ణను రంగంలోకి దింపారట. బాలయ్య వెళ్లి రావి ఫ్యామిలీతో మాట్లాడి 2014 ఎన్నికల్లో టికెట్ హమీ ఇచ్చి వెంకటేశ్వరరావును టీడీపీలో చేర్చుకున్నారు. నాని ఎమ్మెల్యేగా ఉండగానే ఆయన్ను గుడివాడ పార్టీ ఇన్ ఛార్జిగా నియమించారు. అక్కడితో నాని మనసు విరిగిపోయింది. చంద్రబాబు రాజకీయం చూసి అసహ్యం వేసింది ఆయనకు. అందుకే వైసీపీలో చేరారు. 2014, 2019లో వరుసగా టీడీపీని మట్టికరిపిస్తూ వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంత నెమ్మదిగానే ఉన్నా అధికారంలోకి వచ్చి మంత్రి అయ్యాక మాత్రం సందర్భం దొరికినప్పుడల్లా కాదు సంధర్భాన్ని క్రియేట్ చేసుకుని మరీ చంద్రబాబు నాయుడును ఏకిపారేస్తున్నారు.