తెలుగు రాష్ర్టాల మధ్య చోటు చేసుకున్న జలవివాదం కృష్ణాబోర్డులో పంచాయితీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బోర్డు ఆధ్వర్యంలో జరిగిన నిన్నటి భేటీలో మరోసారి జలసామరస్యత చేసుకుంది. కృష్ణాజలాలకు సంబంధించి రెండు రాష్ర్టాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిని కనబరిచాయి. వేసవి తాగు నీటి అవసరాల కోసం కృష్ణా జలాల్లో రెండు టీఎంసీల నీటిని కేటాయించాలని ఏపీ సర్కార్ కోరింది. అందుకు తెలంగాణ రాష్ర్ట నీటి వాటా నుంచి కేటాయించేందుకు కేసీఆర్ సర్కార్ అంగీకారం తెలిపింది. ఈ సమావేశంలో నీటి వినియోగం, శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి నిలువలు తదితర అంశాలు చర్చించారు.
ఏపీలోని గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వేసవిలో తాగు నీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ జలాయశం నుంచి రెండు టీఎంసీల నీటిని కేటాయించాలని ఏపీ ఈఎన్ సీ నారాయణరెడ్డి త్రిసభ్యకమిటీలో ప్రతిపాదించారు. నాగార్జున సాగర్ జలాయశంలో నీటిమట్టం గతంలో పలుమార్లు 510 అడుగుల దిగువకు కూడా తీసుకుపోయి నీటిని వినియోగించుకున్నట్లు బోర్దు దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ రాష్ర్టం వాటా కింద 49 టీఎంసీల నీరు ఉన్నందున అందులో నుంచి రెండు టీఎంసీల నీటిని ఏపీకి ఇచ్చేందుకు తెలంగాణ రాష్ర్ట నీటిపారుదల శాఖ అంగీకారం తెలిపింది. దీంతో నాగార్జున సాగర్ నీటి మట్టం 510 అడుగుల దిగువకు తీసుకుపోవాల్సినవసరం లేదని త్రిసభ్య కమిటీ అభిప్రాయపడింది.
అంతకు ముందు తెలంగాణ, ఏపీకి సంబంధించిన నీటి కేటాయింపులను ఆ రాష్ర్టం పూర్తిగా వినియోగించుకుందని బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. ఇక అసలైన కృష్ణా జలాలను ఏ రాష్ర్టం ఎంత వాడుకుంది అంశాలను ఈనెలాఖరు వరకూ పెండింగ్ లో పెట్టారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంతో పాటు పలు అంశాలపై చర్చ జరిగింది. ఈనెలాఖరుకు నీటి సంవత్సరం ముగియనందున ఆలోపే నాగార్జున సాగార్ జలాశయం నుంచి కేటాయించిన రెండు టీఎంసీల నీటిని కుడి కాలువ ద్వారా వినియోగించుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కార్యదర్శి ఏపీకి సూచించారు. ఇదిలా ఉండగా తెలుగు రాష్ర్టాల ముఖ్యమత్రులు వాటర్ వార్ పై చర్చించేందుకు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. జూన్ లో ఇరు రాష్ర్ట ముఖ్యమంత్రులు భేటి కానున్నారు. వివాదం కోర్టు, అపెక్స్ కమిటీ ముందుకు వెళ్లకుండా పరిష్కారం వెదుక్కోవాలని ఆలోచన చేస్తున్నారు. అయితే రెండు రాష్ర్టాల మధ్య ఈ వివాదం కొత్తదికాదు. రెండు రాష్ర్టాలు ఏర్పాటైన దగ్గర నుంచి తలెత్తిన సమస్యకు తాత్కాలిక పరిష్కారం దొరుకుతుంది తప్ప! పర్మినెంట్ సొల్యుషన్ దొరకలేదు.