అది మార్చి 10 – 2022.. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఇప్పటంలో ఆ రోజు సాయంత్రం జరిగిన జనసేన తొమ్మిదో ఆవిర్భావ సభకు భారీ సంఖ్యలో జనసైనికులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి పవన్ కల్యాణ్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు కీలక హామీలు ఇచ్చారు. అందులో ఒకటి ప్రధానంగా యువతను ప్రత్యేకంగా ఆకర్షించింది!
ఇందులో భాగంగా… జనసేన అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తుందో వివరించిన పవన్ కల్యాణ్.. తమది షణ్ముఖ వ్యూహమని తెలిపారు. అయిదారుగురు కలసి ఉపాధి కల్పించే వృత్తో, వ్యాపారమో చేసుకుంటే.. వారికి రూ.10 లక్షలు ఇస్తామని తెలిపారు. దీంతో… ఆ సభా ప్రాంగణం అంతా కరతాళ ధ్వనులు, విజిల్స్ తో హోరెత్తిపోయింది. ఇప్పటివరకూ ఏ నాయకుడూ ఇలాంటి హామీ ఇవ్వలేదనే కామెంట్లతో దద్దరిల్లిపోయింది.
ఆ తర్వాత… జూన్ 30 – 2023న వైఎస్ జగన్ పరిపాలన వైఫల్యాలను ఎత్తిచూపే లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’ లో భాగంగా భీమవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆ సభకు విచ్చేసిన అశేష జనవాహినిని ఉద్దేశించి పవన్ ప్రసంగిస్తూ… ప్రధానంగా యువతకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా… ఇప్పటం సభలో ఇచ్చిన హామీని రిపీట్ చేశారు.
ఈ సందర్భంగా మైకందుకున్న జనసేనాని… కలల ఖనిజాలతో, ఆకాశమంత ఆశయాన్ని నింపుకొని, పట్టం కట్టే ప్రతిభే దారి చూపుతుందని భావించిన యువతకు ఈ వైసీపీ ప్రభుత్వం రూ.5 వేల గౌరవ వేతనాన్ని ఇచ్చే వాలంటీరు ఉద్యోగాలను ఇచ్చిందని అన్నారు. అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఏటా జాబ్ క్యాలెండరు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన పెద్దమనిషి, తర్వాత వాలంటీర్ ఉద్యోగాలను భర్తీ చేసి మమ అనిపించారని విమర్శించారు.
ఓ వైపు వయసు మీరుతూ, మరోవైపు సమర్ధత తగ్గుతూ నిరాశలోకి జారిపోతున్న యువతకు వైసీపీ ప్రభుత్వం మొండిచేయి చూపిందని.. పరిశ్రమలు తీసుకొస్తామని, వాటిలో 70 శాతం యువతకు ఇస్తామని చెప్పి, ఉన్న పరిశ్రమలనే బయటకు పంపేశారని.. ఐటీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి, ఒక్క ఐటీ కంపెనీ తీసుకురాలేకపోయారని పవన్ కల్యాణ్ విమర్శించారు. అలా అని ఆయన విమర్శలకు మాత్రమే పరిమితం కాలేదు!
ఈ సందర్భంగా… రాష్ట్ర యువతలో అద్భుతమైన నైపుణ్యాలున్నాయని చెప్పిన పవన్ కల్యాణ్… జనసేన ప్రభుత్వంలో యువతను ఓ ఎలన్ మాస్క్, ఓ సత్య నాదెళ్ల, ఓ సుందర్ పిచాయ్ వంటి గొప్ప స్థానాల్లో చూసేలా విధానాలు ఉంటాయని స్పష్టం చేశారు.
వారిలో ఉన్న కొత్త ఆలోచనలు బయటకు తీసి, వారిని గొప్ప ఎంటర్ ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దుతామని.. దామాషా పద్ధతి ప్రకారం ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువతను ఎంపిక చేసి, వారిలోని ప్రతిభ, నైపుణ్యాలను వెలికితీసి పదిమందికి ఉపయోగపడేలా చూస్తామని స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో… నవంబర్ 4 – 2023న హైదరాబాద్ లో చంద్రబాబు నివాసంలో జరిగిన భేటీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టో కోసం ఆరు అంశాలు ప్రతిపాదించారు! ఇందులో ప్రధానంగా… సౌభాగ్య పథకం పేరిట ఏటా లక్ష మంది యువ పారిశ్రామిక వేత్తలకు చిరు వ్యాపారాలు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు నడుపుకునేలా రూ.10లక్షల చొప్పున సాయం అందించాలని నిర్ణయించారు!
ఆ తర్వాత ఎన్నికల నాటికి ఈ హామీపై జనసేన నుంచి మరింత స్పష్టత వచ్చింది! ఇందులో భాగంగా.. యువతను.. వ్యాపార, పారిశ్రామికవేత్తలను చేసేందుకు 10 లక్షల పెట్టుబడి సాయం అందించనున్నామని.. ప్రతీ నియోజకవర్గం నుండి 500 మందికి అవకాశం లభించనుందని.. తద్వారా ఒక్కో నియోజకవర్గంపై ప్రభుత్వ పెట్టుబడి ఖర్చు 50 కోట్లుగా ఉంటుందని వెల్లడించింది!
ఇదే సమయంలో… కేవలం ఒక్కసారి 50 కోట్ల రూపాయలు ఒక్కో నియోజకవర్గ యువతపై ప్రభుత్వం ఖర్చుపెట్టడం ద్వారా నెలకు 15 కోట్ల వరకు ఆదాయం సృష్టించవచ్చని.. ఇది యువతను వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా మార్చే గొప్ప ప్రయత్నమని.. పైగా తమ సొంత ప్రాంతంలోనే ఉపాధి అవకాశాలు అందుకోవచ్చని చెబుతూ… దీనిని సంపద సృష్టించడం అంటారని నాడు జనసేన స్పష్టం చేసింది!
అయితే.. ఏపీలో జనసేనతో కూడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి రెండేళ్లు పూర్తి చేసుకుంటుంది. అయినప్పటికీ పవన్ కల్యాణ్ చెప్పిన షణ్ముఖ వ్యూహంలోని నియోజకవర్గంలో 500 మందికి 10 లక్షల చొప్పున ఇచ్చి, యువతను పారిశ్రామికవేత్తలుగా మార్చే “భాగ్యం” మాత్రం ప్రారంభమవ్వలేదు. ఈ సమయంలోనే ఓ గుడ్ న్యూస్ రాబోతుందని అంటున్నారు!
అవును… జనసేన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని, మూడో ఏడాదిలో అడుగు పెట్టనున్న నేపథ్యంలో… నియోజకవర్గంలో 500 మందికి 10 లక్షల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించే పథకం ప్రారంభించనున్నారని తెలుస్తోంది!
ఈ పథకంపై రాష్ట్రంలోని యువత ఎన్నెన్ని ఆశలు పెట్టుకున్నారో అంత కంటే ఎక్కువగా.. యువతను పారిశ్రామికవేత్తలుగా మార్చాలని పవన్ కల్యాణ్ కంకణం కట్టుకున్నారని చెబుతున్నారు! అందువల్లే… త్వరలో “జనసేన పార్టీ” తరుపున “కూటమి ప్రభుత్వం” నుంచి ఈ పథకం అమల్లోకి రానుందని.. ఇప్పటికే జనసేనాని ఈ విషయంపై పార్టీలోని కీలక నేతలతో చర్చించారని సమాచారం!
మరోవైపు… కూటమి ప్రభుత్వం మూడో ఏడాదిలోకి అడుగుపెట్టనున్న నేపథ్యంలో… టీడీపీ తరుపున అన్నట్లుగా.. సుమారు 1.53 లక్షల మంది మహిళలకు వితంతు పింఛన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే వీరికి కూడా సామాజిక పింఛన్ హోల్డర్స్ కి ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రూ.1,000 చొప్పున పెంచిన మొత్తాన్ని ఏరియర్స్ గా ఇచ్చినట్లు.. గడిచిన రెండేళ్ల డబ్బూ ఇస్తారా.. లేక, ఇప్పటి నుంచే స్టార్ట్ అంటారా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది!
