కవిత కొత్త పార్టీపై బీజేపీ సెటైర్లు: “ఎన్ని పార్టీలు వచ్చినా భయం లేదు.. మా లక్ష్యం అధికారమే!”

K Kavitha: తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీల రాకపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడంపై ఆయన స్పందిస్తూ, తెలంగాణలో ఎన్ని కొత్త పార్టీలు పుట్టుకొచ్చినా బీజేపీకి వచ్చే నష్టం ఏమీ లేదని స్పష్టం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గత పన్నెండేళ్లుగా అత్యంత పారదర్శకమైన, అవినీతిరహిత పాలనను అందిస్తోందని రామచందర్ రావు కొనియాడారు. “తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

“వారి బిడ్డ పెట్టేది కూడా పాత టీఆర్ఎస్సే” రాష్ట్రంలో కొత్త పార్టీల ప్రకటనలపై రామచందర్ రావు ఎద్దేవా చేస్తూ..

“ఇక్కడ ప్రతి ఒక్కరూ పార్టీలు పెడుతున్నారు. ఇప్పటికే కేఏ పాల్ లాంటి వారు పార్టీలు పెట్టుకుని తిరుగుతున్నారు. గతంలో టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) కాస్తా బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా మారింది. ఇప్పుడు వారి బిడ్డ పెట్టిన పార్టీ కూడా మళ్ళీ టీఆర్ఎస్సే (తెలంగాణ రాష్ట్ర సేన). పేర్లు మారినా, వ్యక్తులు మారినా వారి తీరు మారదు” అని చురకలు అంటించారు.

దేశంలో కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన పునరుద్ఘాటించారు. బిడ్డ వేరే పార్టీ పెట్టినా అది పరోక్షంగా కుటుంబ ప్రయోజనాల కోసమేనని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ పాలనను చూశారని, ఇప్పుడు వస్తున్న కొత్త పార్టీల వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను కూడా గమనిస్తున్నారని తెలిపారు.

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. కవిత కొత్త పార్టీ వల్ల ఓట్ల చీలిక ఎటువైపు మళ్లుతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

Kutami Leaders Honey Trap Issue, Chandrababu Reaction | Telugu Rajyam