CM Revanth Reddy: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని అందరూ అనుకుంటున్నారని, కానీ ఆయన గృహ నిర్బంధంలో ఉన్నారేమోనన్న అనుమానం తనకు కలుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యానించారు. రాముడి గొప్పతనం రావణుడి వల్ల తెలిసినట్టే, కేసీఆర్ ఉండటం వల్లే తనకు ఈ గుర్తింపు వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
నియోజకవర్గాల పునర్విభజన అంశంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. లక్ష్మణ్ వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంతో కూడుకున్నవని, అసలు ఆయనకు డాక్టరేట్ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. నియోజకవర్గాల సంఖ్య పెరిగినా భౌగోళికంగా గ్యాప్ అలాగే ఉంటుందని, ఈ విషయంలో తెలంగాణను తెలివిగా మోసం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

సీట్ల పెంపు విషయంలో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం ఉండటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రానికి కేవలం ఐదు ఉత్తరాది రాష్ట్రాల సీట్లు ఉంటే సరిపోయే పరిస్థితి వస్తే, దక్షిణాది రాష్ట్రాల ప్రాముఖ్యత తగ్గిపోతుందని హెచ్చరించారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల పెంపులో అన్యాయం జరిగితే అది దేశ సమాఖ్య స్ఫూర్తికే విఘాతమని ముఖ్యమంత్రి అన్నారు. ఒకవేళ ఇదే వివక్ష కొనసాగితే భవిష్యత్తులో బండి సంజయ్, కిషన్ రెడ్డి వంటి నేతలకు రాజకీయంగా ప్రాధాన్యత ఉండదని, దేశంలో నియంతృత్వ పోకడలు పెరిగే ప్రమాదం ఉందని విమర్శించారు.
నియోజకవర్గాల పునర్విభజన అనేది కేవలం సంఖ్యకు సంబంధించినది కాదని, అది రాజకీయ అస్తిత్వానికి సంబంధించిన అంశమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

