సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా అయినవారు చాలామందే ఉన్నప్పటికీ.. స్టార్స్ గా వెలుగొంది సీఎంలు మారినవారు అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేర్లు.. ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్! ఆ తర్వాత కాలంలో తమిళనాడులో విజయ్ కాంత్, కమల్ హాసన్, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి వంటి వారు గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చినా.. ఆ స్థాయిలో ప్రభావం చూపలేదు!
ఈ క్రమంలో తెలుగులో “జనసేన” అంటూ పవన్ కల్యాణ్ సొంత పార్టీ పెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పొలిటికల్ స్టాండ్, ఇచ్చే పబ్లిక్ స్టేట్ మెంట్లు, పొలిటికల్ కామెంట్లు, రాజకీయ మిత్రులు, ప్రత్యర్థుల సంగతి అలా ఉంచితే.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, అత్యంత కీలక స్థానంలో ఉన్నారు.
అయితే… రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీపై పవన్ కల్యాణ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు! రెండు పాచిపోయిన లడ్డులు చేతిలో పెట్టారంటూ ప్రత్యేక ప్యాకేజీ, పోలవరానికి జాతీయ హోదాపై గట్టిగా మాట్లాడారు! వాస్తవానికి 2014లోనే ఎన్నికల్లోనే పవన్ పోటీ చేస్తారని చాలామంది భావించినా.. ఆయన తనదైన వ్యూహాల్లో భాగంగా దూరంగా ఉన్నారు!
ఇక 2019 ఎన్నికలకు ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పై పవన్ కల్యాణ్ తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అవినీతి పేరుకుపోయిందని మండిపడ్డారు.
అయితే.. ఆ ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీ చేసి ఒకే ఒక్క స్థానం ‘రాజోలు నియోజకవర్గం’లో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచిన పరిస్థితి. ఇక గాజువాక, భీమవరంలలో పోటీ చేసిన పార్టీ అధినేత పవన్ మాత్రం ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా జనసేనకు వచ్చిన ఓట్ల శాతం 5.53%!
దీంతో… ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ ఆటలో అరటి పండు అనే మాటలు వినిపించాయి! కట్ చేస్తే… 2024 ఎన్నికలకు ముందు బీజేపీ, టీడీపీతో జతకట్టారు పవన్ కల్యాణ్. ఏపీలో కూటమి రాజకీయానికి తెరలేపి, అందులో తనదైన పాత్ర పోషించారు. ఆ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి, అన్ని స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు గెలిచారు. ఆ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 6.87% గా ఉంది.
ఇప్పుడు ఈ చరిత్ర అంతా ఎందుకంటే… ఏపీలో పవన్ కల్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్స్ ఎలాగో.. తమిళనాడులో దళపతి విజయ్ అలాగ అని అంటారు! పైగా… ఆ జనరేషన్స్ వాళ్లలో తెలుగులో పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రాగా… విజయ్ సైతం సొంతంగా పార్టీ పెట్టి ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో తమిళనాడులో 85.14% పోలింగ్ నమోదయ్యింది.
ఈ సందర్భంగా ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా… టీవీకే అధినేత విజయ్ తాను పోటీ చేసిన రెండు సీట్లలో భారీ ఆధిక్యంతో గెలుస్తారు అని ప్రచారం బలంగా మొదలైపోయింది. అందుకు.. కొత్త ఓటర్లు మెజారిటీ, విజయ్ కే మొగ్గు చూపినట్లున్నారనే ప్రచారం జరగడం ఒక కారణం కాగా.. ఈ రెండు సీట్లలో అత్యధిక శాతం పోలింగ్ నమోదు కావడం మరో కారణం అని అంటున్నారు.
విజయ్ చెన్నైలోని పెరంబూరు, తిరుచ్చిరపల్లి తూర్పు నియోజకవర్గాలలో పోటీ చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ రెండు సీట్లూ.. అటు అధికార డీఎంకేకి, విపక్ష అన్నాడీఎంకేకీ కూడా మంచి పట్టున్న సీట్లు. దీంతో… సంప్రదాయ ఓటర్లు చాలామంది తాము అభిమానించే పార్టీలకే ఓటు వేసినట్లు కనిపించినా.. కొత్తగా వచ్చిన ఓటర్లు, న్యూట్రల్ ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపారని అంటున్నారు.
ఈ రెండు స్థానాల్లోనూ విజయ్ కచ్చితంగా చరిత్ర సృష్టిస్తారనే చర్చకు ఇంకా బలమైన కారణాలు చెబుతున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగా… ప్రత్యేకంగా ఈ రెండు నియోజకవర్గాల్లోనూ పోలింగ్ కేంద్రాల వద్ద ఎటు చూసినా పెద్ద ఎత్తున యువ ఓటర్లు బారులు తీరి నిలబడడం.. మధ్య తరగతి వర్గాల వారు కూడా మండుటెండలో ఓటింగ్ కోసం క్యూలలో వేచి ఉండడం కనిపించిందని అంటున్నారు.
దీంతో… తమిళనాడు ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారని, మార్పును ఆశిస్తున్నారనే దానికి ఇవి సంకేతాలు అని అంటున్నారు విశ్లేషకులు! దీంతో అన్నీ అనుకున్నట్లుగా, అంతా టీవీకే జనాలు కోరుకుంటున్నట్లుగా జరిగితే.. విజయ్ భారీ మెజారిటీతో ఈ రెండు సీట్లను గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారు అని అంటున్నారు. అదే జరిగితే… ఇటీవల కాలంలోని రాజకీయాల్లో ఇది కచ్చితంగా సరికొత్త రికార్డ్ అని చెబుతున్నారు!
ఈ సమయంలో పలువురు సోషల్ మీడియా జనాలు… 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పెర్ఫార్మెన్స్ తోనూ పోల్చి చూస్తూ పోస్టులు పెడుతున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంతటి వారే పోటీ చేసిన రెండు చోట్లా భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలైన నేపథ్యంలో… విజయ్ తాను తొలిసారి పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ గెలిస్తే… అది ఖచ్చితంగా రియల్ “పవర్” అవుతుందని, ఇది ఆయన రాజకీయ భవిష్యత్తుకు బంగారు బాటగా మారే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే… తమిళనాడు ఎన్నికలు, పోలింగ్ సరళి పై జనసైనికులు ఆసక్తిగా ఆరా తీస్తూ, గమనిస్తున్నారని చెబుతున్నారు. ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అంటున్నారు!
ఏది ఏమైనా… మరికొన్ని రోజులు ఆగితే, ఈ నెల 29 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇవి ఎన్ని చెప్పినా, ఎలా చెప్పినా… మే4న విడుదలవ్వబోయే ఎన్నికల ఫలితాలు మాత్రం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనాలు సృష్టించే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు!
