Padi Kaushik Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయంగా భిక్ష పెట్టిన కడియం శ్రీహరి, ఇప్పుడు అదే పార్టీపై విమర్శలు చేయడం సిగ్గుచేటని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, కడియం శ్రీహరి తీరును తీవ్రంగా ఎండగట్టారు.
“కేసీఆర్ గారు కడియం శ్రీహరికి ఏం తక్కువ చేశారు? సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టి మరీ ఆయనకు టిక్కెట్ ఇచ్చారు. అలాంటిది గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన కడియం.. ఇప్పుడు కేసీఆర్, హరీశ్ రావులపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం?” అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీలో ఆయన కాంగ్రెస్ ప్రతినిధుల పక్కన కూర్చున్నందుకే, ‘మీరు ఏ పార్టీలో ఉన్నారు?’ అని తాము ప్రశ్నించామని, అందులో తప్పేముందని ఆయన నిలదీశారు. కడియం అసలు ఏ పార్టీ పక్షాన మాట్లాడుతున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో జరుగుతున్న మైనింగ్ కుంభకోణాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు ఆధారాలతో సహా అసెంబ్లీలో బయటపెట్టారని కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు. మైనింగ్ స్కాంపై నిజాలు బయటకు రావాలంటే వెంటనే ‘హౌస్ కమిటీ’ వేయాలి. ప్రభుత్వం సీఐడీ విచారణ అంటోంది, కానీ ఒక మంత్రిపై అధికారులు విచారణ చేస్తే న్యాయం జరుగుతుందా? అని ప్రశ్నించారు.
ఈ కుంభకోణం నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

