ఆంధ్రప్రదేశ్ లో కూటమి పార్టీలు అధికారలోకి వచ్చి మరికొన్ని రోజుల్లో రెండేళ్లు పూర్తికానుంది. ఈ రెండేళ్లలో ఎన్నో నేరాలు – ఘోరాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దాటవేతలు, ప్రశ్నించిన ప్రజలపై కేసులు, నిలదీసిన మీడియాకు ముఖం చాటేయడాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో మరి ప్రజల గొంతుకగా నివాల్సిన ప్రతిపక్షం వైసీపీ దీనిపై ఏ మేరకు పోరాడుతోంది..? ఏ మేరకు తన వాయిస్ ని వినిపిస్తోంది..?
వాస్తవానికి.. 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు, వాటిపై ఎంతో నమ్మకం పెట్టుకున్న ప్రజలు, ఫలితంగా రికార్డ్ స్థాయిలో వచ్చిన సీట్లు… అంతా బాగానే ఉంది. కానీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పలు హామీలపై దాటవేత ధోరణి అవలంభించగా.. మరికొన్ని హామీలకు టెరమ్స్ & కండిషన్స్ పెట్టారు! ఇంకొన్ని హామీలను ఐదేళ్లు అమలు చేయకుండా నిర్ణయాలు తీసుకున్నారు!
ఇక… పార్కుల్లో నడకకు టాక్సులు, ప్రభుత్వ ఆస్తులు 99 ఏళ్లకు లీజు అంటూ ప్రైవేటు వ్యక్తుల పాలు.. మళ్లీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై పీపీపీ కబుర్లు.. విద్యుత్ చార్జీల వ్యవహారం.. మొక్కజొన్న, ధాన్యం, పత్తి, మిర్చి మొదలైన పంటలకు గిట్టుబాటు ధరల్లేని పరిస్థితి.. పదో తరగతి పరీక్ష పేపర్ల స్పాట్ వాల్యూషన్ కూడా సరిగా చేయలేని దుస్థితి అనే విమర్శలు.. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో మంచినీటి సమస్య.. దళితులపై జరుగుతున్న దాడులు.. వర్షాకాలం అమరావతిలోకి వచ్చిన వరద నీటిని తోడటానికి కోట్ల రూపాయల ఖర్చులు.. దేవాదాయ భూములు సైతం ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం.. చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు!
ఇక… వరుసగా కూటమి ప్రభుత్వంలోని పార్టీలైన టీడీపీ, జనసేనకు సంబంధించిన పలువురు నాయకులు, ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా… మహిళల విషయంలో కూటమిలోని పలువురు ఎమ్మెల్యేల వ్యవహారం సభ్యసమాజం తలదించుకునే స్థాయిలో ఉందనే చర్చా నడుస్తోంది. ఆవు చేలే మేస్తో, దూడ గట్టున మేస్తుందా అన్నట్లుగా ఎమ్మెల్యేలే అలా ఉండే సరికి, వారి అనుచరులు వారి వారి స్థాయిల్లో చెలరేగిపోతున్నారని అంటున్నారు!
దీంతో… వైసీపీ కార్యకర్తలపై దాడులు, మహిళలపై అఘాయిత్యాలు, బాలికలకు వేధింపులు, వీధికి నాలుగు చొప్పున బెల్టు షాపులు, అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా గ్రామాల్లో సైతం విపరీతంగా ప్రవహిస్తోన్న మద్యం, తాజాగా హనీ ట్రాప్ వంటి దారుణాలు విశృంఖలంగా పెరిగిపోతున్న పరిస్థితి అనే చర్చ జనాల్లో బలంగా నడుస్తోందని చెబుతున్నారు!
అయితే… ఇన్ని సమస్యలు కంటికి కనిపిస్తున్నా.. ప్రతిపక్ష వైసీపీ నుంచి మాత్రం రావాల్సిన స్థాయిలో ప్రతిస్పందన కనిపించడం లేదనే చర్చ బలంగా వినిపిస్తోంది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్లో ఉన్నంత కసి, రెస్పాన్సిబిలిటీ.. వైసీపీ నేతల్లో కనిపించడం లేదనే కామెంట్లూ తాజాగా వినిపిస్తోన్నాయి! 175 నియోజకవర్గాల్లోనూ సమస్యలు కనిపిస్తోన్న వేళ.. వారు చేస్తోన్న పోరాటాలు, జనాలకు చెబుతోన్న విషయాలు ఏమిటనేది ఇక్కడ కీలకంగా ఉంది.
ఎందుకంటే… రాష్ట్ర స్థాయిలో సమస్యలపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెడతారు.. అందులో మాట్లాడాల్సినవి మాట్లాడతారు.. అవి ప్రజల్లోకి బలంగా వెళ్తాయి. అలా అని ప్రతీ విషయంపైనా వైఎస్ జగన్ ప్రతి రోజూ ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితులు ఉండకపోవచ్చు. మరోవైపు పేర్ని నాని, అంబటి రాంబాబు, మొదలైన కొంతమంది నేతలు తమ వాయిస్ ని బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో… నియోజకవర్గాల్లో ప్రతీ వైసీపీ నాయకుడు తమ వాయిస్ ను కనీసం తమ ప్రాంత పరిధిలోనైనా బలంగా వినిపిస్తున్నారా అంటే.. సమాధానం వారికే తెలియాలి!
వాస్తవానికి.. ప్రభుత్వం తన తప్పిదాలపై ప్రతిపక్షం ప్రశ్నించకుండా, ప్రజలను డైవర్ట్ చేసేలా పావులు కదుపుతోంది! ప్రజా సమస్యను పక్కనపెట్టి… వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత పైనా వ్యక్తిత్వ హనానికి పాల్పడుతోంది! ఇందులో భాగంగా… వైసీపీని గొడ్డలి పార్టీ అని, కిల్లర్ పార్టీ అని వైసీపీ క్రిమినల్స్ తో రాజకీయాలు చేస్తున్నామనే విషయాన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవాలని స్వయంగా సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి.
ఈ పరిణామాల నేపథ్యంలో… వైసీపీ నుంచి సరైన ప్రతిస్పందన రావడం లేదనే చర్చ బలంగా నడుస్తోంది. పైగా.. చంద్రబాబును వ్యక్తిగతంగా, ముఖ్యమంత్రిగా విమర్శించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని.. కార్నర్ చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని.. కాని వాటిని వైసీపీ నేతలు సక్రమంగా ఉపయోగించుకోవడం లేదని.. సోషల్ మీడియా కార్యకర్తలు అంటున్నారని తెలుస్తోంది.
ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇన్ ఛార్జుల శిక్షణలో భాగంగా నిర్వహించిన ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు… వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసాన్ని నిరంతరం ప్రజలకు గుర్తుచేయాలని తెలిపారు.
ఇక్కడే చంద్రబాబు పాలనలోని వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది! మనం ఈ రెండేళ్లు చేసిన కార్యక్రమాలను, అభివృద్ధిని జనాల్లోకి బలంగా తీసుకెళ్లండి అనాల్సింది పోయి… ఇప్పటికీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు గుర్తు చేయాలని చెప్పడం అంటే… పరోక్షంగా చంద్రబాబు తన పాలనలోని వైఫల్యాన్ని కార్యకర్తల మధ్య ఒప్పుకున్నట్లే!!
ఈ విషయాన్ని వైసీపీ నేతలు గ్రహించాలి. ఈ “వైఫల్యం మాటలను” జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని.. ఇదే సమయంలో… 2014-19 కాలంలో చంద్రబాబు ప్రభుత్వ చేసిన తప్పిదాలు.. మళ్లీ అవే రిపీట్ చేస్తోన్న వైనాన్ని వివరించాలని అంటున్నారు. ఇందులో భాగంగా… నాడు జన్మభూమి కమిటీలు చేసిన పనులు.. పసుపు-కుంకుమా అంటూ ఎన్నికలకు ముందు జనాలను ఏమార్చే పనికి పూనుకోవడాలు.. జనాలు వాటిని నమ్మకుండా షాకివ్వడాలు వంటి అంశాలను తెరపైకి తేవచ్చని సూచిస్తున్నారు.
ఇక్కడ పాయింట్ ఏమిటంటే.. ఎన్నికల సమయంలో గత ప్రభుత్వంపై చంద్రబాబు ఎన్ని విమర్శలు చేసినా చెల్లుతుంది, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల హనీమూన్ పిరియడ్ లోనూ నడుస్తుంది.. కానీ, నాలుగో సారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న 40 ఏళ్ల సీనియర్ పొలిటీషియన్.. ఇప్పటికీ గత ప్రభుత్వ పాలనపైనే మాట్లాడుతుంటే.. అది కచ్చితంగా తన్న ఫెయిల్యూర్ పై సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే కదా?
అంటే… ఈ ఐదేళ్లూ చంద్రబాబు గత వైసీపీ పాలనపైనే విమర్శలు చేస్తుంటారా..? సంపద సృష్టించడం ఏలాగో తనకు తెలుసని చెప్పిన చంద్రబాబు, సంపద సృష్టించి అన్ని హామీలను అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు, ఆ మాటలు నమ్మి ప్రజలు ఓటు వేసిన తర్వాత సీఎం కుర్చీలో కూర్చున్న చంద్రబాబు… గత ప్రభుత్వం వైఫల్యాలపై జనాలకు చెప్పాలని కార్యకర్తలకు సూచిస్తున్నారంటే… ఇందులో అసలు విషయాన్ని వైసీపీ గ్రహించాలి.. జనాల్లోకి తీసుకెళ్లాలని చెబుతున్నారు!
ప్రతిపక్ష పార్టీని.. గొడ్డలి పార్టీ, కిల్లర్ పార్టీ, వైసీపీ క్రిమినల్స్ అని చంద్రబాబు అంటుంటే… వైసీపీ నేతలు సైతం టీడీపీని “సైలంట్ కిల్లర్ పార్టీ”, “వెన్నుపోటు పార్టీ”, “కామాందుల కూటమి” అని అనాలని… జగన్ ను “సైకో జగన్” అని అంటుంటే.. చంద్రబాబును “సైతాన్ బాబు”, “పిల్ల దెయ్యం చిన బాబు” అని కౌంటర్స్ వేయాలని.. “నందమూరి తారక రామారావు గారి తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టిన వ్యక్తి.. కుటుంబ విలువల గురించి మాట్లాడతారా..”? అని అనాలని నేతలకు, సోషల్ మీడియా జనాలు సూచిస్తుంటే సూచించొచ్చు!
కానీ… సోషల్ మీడియా కార్యకర్తలు సూచనల సంగతి కాసేపు పక్కనపెడితే… ఫ్రజాసమస్యలపైనా, ప్రభుత్వ వైఫల్యాలపైనా, చంద్రబాబు సర్కార్ తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపైనా… వైసీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు తమ తమ ప్రాంతాల్లో వరుసగా ప్రెస్ మీట్ లు పెట్టాలని.. తాము చెప్పాలనుకున్న విషయాన్ని రాష్ట్రం మొత్తం వ్యాపించేలా చేయాలని సూచిస్తున్నారు పరిశీలకులు.
మరో కీలక విషయం ఏమిటంటే… చంద్రబాబు పాలనలో ఉన్న లోపాలు, తప్పిదాలపై వైసీపీ నేతల రియాక్షన్ నెమ్మదిగా, ఆలస్యంగా వస్తోందనేది పలువురు పరిశీలకుల మాటగా ఉంది. దీనివల్ల “ప్రజల గొంతు ప్రభుత్వానికి వినిపించకుండా పోతోందని” అంటున్నారు.
ఈ సందర్భంగా తమకు మీడియా బలం లేదనే విషయాన్ని గ్రహించి.. ఎవరో ఒకరు తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెడితే సరిపోతుందని అనుకోకుండా.. బలంగా తమ తమ వాయిస్ ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెబుతున్నారు.
మహా మంత్రి తిమ్మరుసు చెప్పినట్లుగా చంద్రబాబు గీసిన గీత పక్కన మరో పెద్ద గీత గీసి జనంలో ఎప్పటికప్పుడు ప్రజాసమస్యలపై కొత్త చర్చకు తెర లేపాలని.. అందుకు ప్రభుత్వం తన వైఫల్యాలతో, తమ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో బోలెడు అవకాశాలు ముందుంచిందని.. వాటిని సద్వినియోగం చేసుకుంటూ వాస్తవాలను ప్రజలకు చెప్పాలని చెబుతున్నారు.
