MLC Anantha Babu Arrested: దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ (అనంతబాబు)ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. రాజమండ్రి కోర్టు ప్రాంగణం వెలుపల పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
గతంలో ఈ కేసులో అనంతబాబుకు మంజూరైన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై శుక్రవారం రాజమండ్రి ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు అనంతబాబు తన భార్య లక్ష్మీదుర్గతో కలిసి హాజరయ్యారు. విచారణ ముగించుకుని ఆయన కోర్టు వెలుపలికి రాగానే, అప్పటికే అక్కడ మాటు వేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నట్లు సమాచారం.
నాలుగేళ్ల క్రితం అనంతబాబు వద్ద డ్రైవర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఈ కేసులో అనంతబాబును ప్రధాన నిందితుడు (A1)గా పోలీసులు చేర్చారు. ఆయన భార్య లక్ష్మీదుర్గను A2 నిందితురాలిగా పేర్కొన్నారు. సుదీర్ఘ కాలంగా విచారణ సాగుతున్న ఈ కేసులో, తాజాగా బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు కావడంతో పరిణామాలు వేగంగా మారాయి.
ఎమ్మెల్సీ అరెస్ట్ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు రాజమండ్రి కోర్టు సముదాయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అనంతబాబు అనుచరులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
ఈ అరెస్టుతో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణ మరో కీలక మలుపు తిరిగినట్లయింది. బాధితుడి కుటుంబానికి న్యాయం జరుగుతుందని దళిత సంఘాలు ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

