నాడు ‘కాల్ మనీ’.. నేడు ‘పసుపు హనీ’.. చిక్కితే శనే శని! 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చరిత్రలో ఎన్నడూ లేనంతగా కూటమి పార్టీలు విజయం సాధించిన సంగతి తెలిసిందే. దానర్ధం… వీరి పాలనా సామర్థ్యాన్ని ప్రజలు అంతా నమ్మారని.. వీరి పరిపాలనపై అంతా ఆశలు పెట్టుకున్నారని.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలు వీరు చేయరని, ఇచ్చిన హామీలు తూచ తప్పకుండా నెరవేరుస్తారని.

అయితే… కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు గమనించిన వారు మాత్రం.. ఏపీ ప్రజలు వీరిపై పెట్టుకున్న నమ్మకాలను పూర్తిగా వమ్ము చేస్తున్నారని అంటున్నారు! కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన దాడులు, నేరాలు, ఘోరాలు, సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు వెరసి రెడ్ బుక్ అమలు విషయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.

ఇక ఈ ప్రభుత్వ హయాంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న దాడులు మరింతగా విమర్శలను తెచ్చిపెడుతున్నాయి! పైగా గతంలో మహిళల రక్షణ విషయంలో చేసిన వ్యాఖ్యలకు, ఇచ్చిన హామీలకు ఏమాత్రం పొంతన లేకుండా జనసేనాని నడుచుకుంటున్నారే విమర్శలూ వినిపిస్తున్నాయి. చంద్రబాబు తన పాలనా అనుభవాన్నంతా గాల్లో కలిపేసుకున్నారా, అనే చర్చా నడుస్తోంది.

ప్రధానంగా… ప్రజలు ఎంతో నమ్మి, వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఫలితాలు ఇచ్చినప్పటికీ… ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదని.. పలు హామీలను గాలికి వదిలేశారని.. దీనికి తోడు కూటమి నేతలు చేస్తోన్న పలు అరాచకాలు మరొకెత్తు అవ్వగా, వాటిపై ఎలాంటి చర్యలు లేకపోవడం డ్యామేజ్ కు బోనస్ గా మారిందని చెబుతున్నారు.

ఇవన్నీ చాలవన్నట్లు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హనీ ట్రాప్.. అంటే వలపుల వల అంశం మరో చర్చనీయాంశంగా మారింది. పైగా ఈ వ్యవహారంలోని ప్రధాన నిందితులు అంతా కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలకు ప్రధాన అనుచరులే ఉన్నారనే విషయం బయటకు రావడంతో ఇది చంద్రబాబు ప్రభుత్వానికి మరింత డ్యామేజ్ ని యాడ్ చేసే అంశంగా మారనుందని అంటున్నారు.

వివరాళ్లోకి వెళ్తే… డబ్బున్న వారికి అమ్మాయిలను ఎర వేసి, హనీ ట్రాప్‌ లో ఇరికించి, పెద్ద ఎత్తున బలవంతంగా డబ్బు గుంజి, వారిని పూర్తిగా ఆర్థికంగా దివాలా తీయించే ఓ ముఠా వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. పైగా ఈ దందాలో పలువురు పోలీసు అధికారులను భాగస్వాములుగా చేసుకోవడం మరింత షాకింగ్ గా మారింది. ఇక… ఈ వ్యవహారంలోని ప్రధాన వ్యక్తులంతా టీడీపీ నాయకులకు ప్రధాన అనుచరులనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఈ వ్యవహారంలోని ప్రధాన నిందితురాలు, ఈ హనీట్రాప్‌ ముఠా నాయకురాలు రంగమ్మ… రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీతకు ముఖ్య అనుచరురాలని అంటున్నారు. ఇక, రంగమ్మకు అండగా ఉంటూ బాధితులపై దాడి చేసి, వీడియోలు తీసిన మరో కీలక వ్యక్తి రాజేష్… అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మాజీ మేయర్‌ స్వరూపకు కీలక అనుచరుడని చెబుతున్నారు. వీరితో వారికున్న అనుబంధానికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కేవలం.. కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, వారి అనుచరులతోనే అయిపోయిందనుకుంటే పొరపాటే. ఈ దందాలో కూటమి ప్రభుత్వంలోని పోలీసు అధికారులు సైతం కీలక భూమిక పోషించారని అంటున్నారు. ఇందులో ప్రధానంగా… రాప్తాడు సీఐ శ్రీహర్షది కీలక పాత్ర అని చెబుతున్నారు. దీంతో… సీఐ శ్రీహర్షతో పాటు మరో సీఐ రాజేంద్రనాథ్‌ యాదవ్‌ ను ఉన్నతాధికారులు వీఆర్‌ కు పంపారు!

మరోవైపు.. ఈ దందాకు ప్రధాన సూత్రతాధారులుగా చెబుతోన్న టీడీపీ నేతలు రంగమ్మ, రాజేష్ తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని అంటున్నారు.

ఏది ఏమైనా… ఈ వలపు వల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా.. కూటమి ప్రభుత్వానికి మరో పెద్ద మచ్చలా మారిందని అంటున్నారు! ఈ సందర్భంగా… నాడు “కాల్ మనీ – సెక్స్ రాకెట్” ను ఏపీ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారని తెలుస్తోంది.

ఇక.. ఇప్పటికే అటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఇటు జనసేన ఎమ్మెల్యేల దారుణాలు, దౌర్జన్యాలపై వస్తోన్న ఆరోపణలు, వీడియోలపై పార్టీ పరంగా ఖండించడం, అసంతృప్తి వ్యక్తం చేయడం, విచారణకు ఇంటర్నల్ కమిటీలు వేయడం మినహా… నిందితులపై చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే.

మరి ఇప్పటికైనా చంద్రబాబు సర్కార్ ఈ విషయాలపై తీవ్రంగా స్పందిస్తూ, చర్యలకు ఉప్రక్రమిస్తుందా.. లేక.. ఎప్పటిలాగానే… చంద్రబాబు సీరియస్ స్టేట్ మెంట్లు, తర్వాత మీడియాలో భారీ హెడ్డింగులు, ఆనాక డైవర్షన్స్ తోనే ముందుకు వెళ్తుందా..? అనేది వేచి చూడాలి.