డూస్ అండ్ డోంట్స్… కవితకు షర్మిల కీలక పాఠాలు..!

తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త పార్టీ ఆవిర్భవించింది. కేసీఆర్ కుమార్తె, కేటీఆర్ సోదరి.. కల్వకుంట్ల కవిత.. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ అనే నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. ఈ మేరకు మేడ్చల్‌ జిల్లా మునీరాబాద్‌ లో ఏర్పాటు చేసిన భారీ సభలో పార్టీ పేరును కవిత ప్రకటించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కవితకు షర్మిల పాఠాలు చాలా అవసరమని అంటున్నారు పరిశీలకులు!

అవును… కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆశలతో జారవిడుచుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని, ఆయన కుమార్తె కవిత బలంగా వాడుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితి గా మార్చి, తెలంగాణ సెంటిమెంట్ ను పార్టీ పేరులో కేసీఆర్ దూరం చేసుకోగా… దాన్ని తాజాగా కవిత పొలిటికల్ గా క్యాష్ చేసుకునే పనికి పూనుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారగా… మరోవైపు ఏపీలో షర్మిలతో పోలికలు తెరపైకి వస్తోన్నాయి!

తండ్రి ముఖ్యమంత్రి, ఆయన మరణానంతరం జరిగిన అనేక పరిణామాల తర్వాత 2019లో అన్న ముఖ్యమంత్రి. అన్న పార్టీ కోసం కొంతకాలం పాదయాత్ర చేసి మరీ మద్దతు తెలిపిన చరిత్ర ఆ సోదరి సొంతం. కట్ చేస్తే… ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏపీ శాఖకు చీఫ్ గా ఉన్న అమె.. అన్నపైనా, అన్న పార్టీపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.. నిప్పులు చెరుగుతున్నారు. ఫలితంగా… విశ్లేషకుల నుంచి విమర్శలు పొందుతున్నారు!

ఎందుకంటే… వైఎస్ షర్మిలకు తన అన్న జగన్ తో ఆస్తి తగాదాలో, వ్యక్తిగత అభిప్రాయ బేధాలో ఉండొచ్చు. అది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం. పైగా.. వైఎస్సార్ కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం. దీన్ని వీలైనంత వరకూ నాలుగు గోడల మధ్య ఉంచాల్సిన బాధ్యత ఇద్దరిపైనా ఉంది.

అయితే… షర్మిల మాత్రం తాను “ఎడుగురి సందిటి” ఇంటి ఆడపడుచునే కానీ.. అంతకంటే ముఖ్యంగా “మొరుసుపల్లి” ఇంటి కోడల్ని, ఆ ఇంటి యజమానురాలిని అనుకుంటున్నట్లున్నారని అంటున్నారు పరిశీలకులు!

అందుకు కారణం… నాలుగు గోడల మధ్య జరగాల్సిన ఆస్తి పాస్తుల వ్యవహారంపై పబ్లిక్ గా కామెంట్లు చేస్తున్నారని అంటున్నారు! ఆ చర్చ సంగతి అలా ఉంచితే… ప్రధానంగా రాజకీయంగా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఆమె ప్రతీ అడుగూ ఉంటుందనే విమర్శ దాదాపు అన్ని వర్గాల నుంచీ వినిపిస్తోంది!

గతం సంగతి కాసేపు పక్కనపెడితే… 2024 ఎన్నికల్లో కూటమి బలంగా గెలిచింది. భారీ మెజారిటీతో అధికారంలో ఉంది. ఇక… ఆ ప్రభుత్వంలో జరుగుతున్న ఘోరాలు, దారుణాలు, అమలు చేయని హామీలు, ప్రజావ్యతిరేఖ నిర్ణయాలు వెరసి ఎన్నో సమస్యలు ఉన్నాయి!

అయితే… వీటిపై కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ గా షర్మిల మాట్లాడటం లేదనే చెప్పాలి! ఆమె పెట్టే ట్వీట్లు, చేసే కామెంట్లు మెజారిటీ.. ప్రతిపక్షంలో ఉన్న జగన్ గురించే తప్ప.. అధికారంలో ఉన్న బీజేపీతో కూడిన టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం గురించి మాత్రం కాదని చెబుతున్నారు!

దీంతో.. ఏపీలో షర్మిల వ్యవహార శైలిపై ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసిందని అంటున్నారు. ఆమె ఏ ఇంటి పేరుతో, ఏ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ప్రజాభిమానం సంపాదించుకున్నారో.. ప్రస్తుత వ్యవహార శైలితో అటు నుంచి వచ్చిన ఆదరణను కోల్పోతున్నారని చెబుతున్నారు!

ఒకప్పుడు షర్మిల అంటే.. జగనన్న వదిలిన బాణం… కానీ, ఇప్పుడు షర్మిల అంటే చంద్రబాబు అంబులపొదిలోని అస్త్రం అనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న పరిస్థితి!

రాజకీయంగా ఎదగాలని అనుకుంటున్న షర్మిల… ఇవన్నీ తెలిసే చేస్తున్నారా.. లేక, మరేదైనా బలమైన కారణంతో చేస్తున్నారో తెలియదు కానీ… ప్రస్తుతం ఆమె ఎంచుకున్న మార్గం, అనుసరిస్తోన్న వ్యవహార శైలి మాత్రం ‘రాజకీయ ఆత్మహత్యా సదృశ్యం’గా ఉందని చెబుతున్నారు!

కట్ చేస్తే… తన తండ్రి ముఖ్యమంత్రి, అన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్..! ఈ క్రమంలో జరిగిన పలు పరిణామక్రమాల అనంతరం తాజాగా తెలంగాణలో సొంత, కొత్త పార్టీని ప్రకటించారు కల్వకుంట్ల కవిత. ఈ సమయంలో… సీఎం రేవంత్ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే.. ప్రతిపక్షంలో ఉన్న బీఆరెస్, బీజేపీలను గట్టిగా లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపించారు.

ఈ సందర్భంగా… నాడు చేనేత కార్మికులు చనిపోతుంటే.. ఆనాటి కేసీఆర్‌ భిక్షాటన చేశారు.. కానీ, ఇవాళ్టి కేసీఆర్‌ మారిన మనిషి.. మర మనిషి.. మన మనిషి కాదు. ఎక్కడ చిన్న కష్టం వచ్చినా ఆ సార్‌ రారు.. ఎందుకంటే ఆయన మారిన మనిషి.. గుంటనక్కలు, తోడేళ్ల చేతిలో ఖైదీ అయిన మనిషి అంటూ నిప్పులు చెరిగారు!

రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తిరిగి తీసుకువచ్చే దమ్ముందా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. బీజేపీకి మొదటి నుంచి తెలంగాణరాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదని.. తల్లిని చంపి బిడ్డను తీశారని బీజేపీ పెద్దలు అన్నారని.. మెడకాయ మీద తలకాయ లేని ఓ ఎంపీ తెలంగాణను భారత్, పాక్ విభజనతో పోల్చారని.. అగ్రనాయకత్వం అలా మాట్లాడితే రాష్ట్ర బీజేపీ బానిస ఎంపీలు ఒక్కరు కూడా మాట్లాడలేదని కవిత విమర్శించారు.

ఇదే సమయంలో… సీఎం రేవంత్ రెడ్డిని కవిత టార్గెట్ చేశారు. ఇందులో భాగంగా… రాష్ట్రంలో ఒక కర్కోటకుడి పాలన నడుస్తోందని.. ఒక రాజకీయ నేతను అలా అనకూడదు కానీ, అనాల్సి వస్తుందని అన్నారు. గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా.. సీఎం మాట్లాడట్లేదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై మండిపడ్డారు. అందుకే అతన్ని కర్కోటకుడని అంటున్నట్లు తెలిపారు!

ఈ నేపథ్యంలో… పార్టీ పేరు ప్రకటించిన రోజు అయినందువల్ల అటు అధికార పక్షంపై ఓ మాట, ప్రతిపక్షాలైనా బీఆరెస్, బీజేపీలను తలో మాట… ఇక సహజంగానే తనను సస్పెండ్ చేసిన పార్టీ అధినేత అయిన కేసీఆర్ పై నాలుగు మాటలు అనడం సహజం!

అయితే… తెలంగాణలో తనను తాను మూడు పార్టీలకూ ప్రత్యామ్నాయంగా ప్రకటించుకోవడమే కాదు కానీ.. ఆ దిశగా రాజకీయాలు చేస్తారా అనేది ఇక్కడ కీలకంగా మారింది!

మరి ముఖ్యంగా… ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా అధికార పక్షాన్నే ప్రధానంగా టార్గెట్ చేయాల్సి ఉంటుంది. ఇది అత్యంత సహజమైన విషయం. కానీ.. ఏపీలో షర్మిల వైసీపీ, టీడీపీ లకు తాను ప్రత్యామ్నాయం అనే విషయాన్ని చెప్పలేకపోయారని.. ఈ విషయంలో తప్పు చేశారు.. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో… షర్మిల నుంచి కచ్చితంగా కొన్ని పాఠాలు నేర్చుకుంటూ.. తాను ఏ తానులోనూ ముక్కను కాదని నిరూపించుకుంటూ కవిత ముందుకెళ్తే.. కచ్చితంగా ప్రయోజనం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు! అలాకానిపక్షంలో… శతకోటి లింగాల్లో ఓ బోడి లింగం అయ్యే ప్రమాదం పుష్కలంగా ఉందని చెబుతున్నారు!