ఆగిపోయిన పెళ్లికి బాజాలు వాయించే పనికి పూనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు! ఈ పనికి పూనుకోవడానికి గల కారణాలు ఏమాత్రం సమంజసంగా లేవనే విషయం తెలిసినా… జనాలకు అసలు వాస్తవాలు తెలుసని ఆయన తెలుసుకోలేకపోతున్నారో.. లేక, హస్తిన నుంచి వచ్చిన ఆర్డర్స్ తూచా తప్పక పాటించాలని ఫిక్సయ్యారో కానీ… ముహూర్తాలూ గట్రా ఫిక్స్ చేసే పనిలో బిజీగా ఉన్నారట చంద్రబాబు!
అవును… కాలం మారిపోయింది. ఒకప్పుడు రేడియోలోనో, దూరదర్శన్ లోనో, ఒకటి రెండు పత్రికలకు ఇచ్చిన ప్రెస్ నోట్స్ లోనో ఆయా రాజకీయ నాయకుల, పార్టీల అభిప్రాయాలు తెలిసేవి. ‘ఓహో వాళ్లు ఇలా అన్నారా’ అని జనం అనుకునేవారు. మళ్లీ కొంతకాలానికి సదరు రాజకీయ నాయకుడు కానీ, పార్టీ కానీ గోడ మీద పిల్లి వాటం చూపించి, నాలుక మడతపెట్టినా… నిలదీసి అడగడానికి వారివద్ద సాక్ష్యాలు ఉండేవి కావు!
అయితే ఇప్పుడు లెక్కలు మారాయి. ఇదంతా సోషల్ మీడియా యుగం. కొత్త తరం రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ.. వీటిపై ఇంట్లోని పెద్దలతో సైతం చర్చించే పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయి. ఇక చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే.. మాట మీద నిలబడని నాయకుడి నైజాన్ని.. నాలుక మడతపెట్టే నేతల వైనాన్ని.. “నాడు – నేడు” అంటూ అని స్క్రీన్ పై చూపిస్తున్నారు. దీంతో.. అరచేతిలోనే సదరు నాయకుడి, పార్టీ వైఖరిపై ప్రజలకు అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇదంతా విజనరీ, టెక్ పొలిటీషియన్ చంద్రబాబుకు తెలియదా అంటే… టీడీపీ నేతలు, కార్యకర్తలు ఒప్పుకోరు. ఆయన మరో 10, 20 ఏళ్ల గురించి ఇప్పుడే ఆలోచిస్తారని.. చాలామంది కంటే ఆయన సుమారు పాతికేళ్లు ముందే ఉంటారని చెబుతుంటారు. అలాంటి చంద్రబాబు… పార్లమెంటులో మహిళా బిల్లు వీగిపోయిందని.. అందుకు కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే పార్టీలే కారణమని గట్టిగా చెబుతున్నారు. ఈ సమయంలో మరో అడుగు ముందుకేశారు.
ఇందులో భాగంగా… మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు! దీంతో.. ఆగిపోయిన పెళ్లికి బాజాల మాదిరిగా, వీగిపోయిన బిల్లుకు మద్దతు కోసమంటూ.. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం ఏమిటంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో… ఇండియా కూటమి పార్టీల తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు, సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు సూచించారు.
ఈ నేపథ్యంలోనే… చంద్రబాబు అన్నీ తెలిసే ఈ నిర్ణయం చేశారా.. లేక, హస్తిన నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నడుచుకుంటున్నారా.. అదీగాకపోతే… మోడీ వద్ద మరింత మంచి మార్కులు కొట్టే క్రమంలో ఈ దిశగా ఆలోచన చేశారా అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే… ఇప్పటికే ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో 2023లో మోడీ సర్కార్ ఏ విధంగా వ్యవహరించింది అందరికీ తెలిసిందే. అది బాబుకు తెలియంది కాదుగా..?
వాస్తవానికి… 2023లోనే పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. దీంతో… 2024 ఎన్నికల నుంచి ఈ రిజర్వేషన్ ను అమలు చేయాలని విపక్షాలు నాడు గట్టిగా డిమాండ్ చేశాయి. అయితే.. కుదరదు, 2034 నుంచి అమలు చేస్తామని మోడీ సర్కార్ చెప్పింది. ఇది.. మోడీ, అమిత్ షా లకు తెలియంది కాదు.. చంద్రబాబు & కో మరించిందీ కాదు.. ప్రజలకు గుర్తు లేనిదీ కాదు!
అయితే… ఇటీవల డీలిమిటేషన్ బిల్లును ఆమోదించుకోడానికి, దానికి మహిళా రిజర్వేషన్ బిల్లుతో మెలిక పెట్టారు బీజేపీ పెద్దలు. అయితే.. ఇప్పటికే ఆమోదం పొందిన మహిళా బిల్లును అడ్డుపెట్టి, డీలిమిటేషన్ విషయంలో ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోతుందని విమర్శిస్తూ.. విపక్షాలు అందుకు ఒప్పుకోలేదు. ముఖ్యంగా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఇండియా కూటమి నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వాస్తవం..!
అయితే… ఈ విషయాలు ప్రజలకు తెలియదనో, ప్రజలు మరిచిపోయి ఉంటారనో, వాళ్లు అంత అప్ డేట్ అవ్వలేదులే అనో, అయినా కూడా మరో మూడేళ్లు తనకు ఎలాంటి సమస్యా లేదనో తెలియదు కానీ… అసలు వాస్తవాలను మరుగున పరిచే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు! ప్రస్తుతం.. బీజేపీ ఏమి చెబితే తాను అదే చేస్తా అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు సంపాదించుకుంటున్నారు!
