విశాఖ మెట్రో రీజన్ పరిధిలోకి మరో 13 మండలాలు

ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. దానిపై పూర్తి ఫోకస్ చేసింది. విశాఖ మెట్రో రీజియన్ పరిధి పెంచే దిశగా మరో అడుగు ముందుకు వేసింది. మరో 13 మండలాలను ఈ పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ లక్ష్మి. నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, రావికమతం, బుచ్చయ్య పేట, నాతవరం, సబ్బవరం , దేవరాపల్లి, కె కోటపాడు, మాకవరపాలెం, గోలిగుండా, రోలుగుంట, చీడికాడ, మండలాలను విఎం.ఆర్.డి.ఏ పరిధిలోకి తెచ్చింది ప్రభుత్వం. మరోవైపు పరిపాలనా రాజధాని విశాఖపట్నంలో ప్రాధాన్యతా ప్రాజెక్టులపై సీఎం జగన్ చర్చించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు, బీచ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్, పోలవరం నుంచి గోదావరి జలాలను పైపులైన్‌ ద్వారా విశాఖకు తరలింపు పనులను వేగంగా చేపట్టాలని ఆదేశించారు. నాలుగు వారాల తర్వాత మరోసారి సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. దీని తర్వాత మెట్రో ప్రాజెక్టులపై దృష్టిపెట్టాలని సీఎం అన్నారు.

Vizag Excutive capital:విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటిల్ దిశగా మరో అడుగు: మెట్రో రీజన్ పరిధిలోకి మరో 13 మండలాలు

విశాఖపట్నం నుంచి భీమిలి వరకూ ఇప్పుడున్న బీచ్‌రోడ్డు విస్తరణ, అలాగే భీమిలి నుంచి భోగాపురం వరకూ బీచ్‌ రోడ్డు నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు సీఎంకు వివరించారు. భూసేకరణతో కలుపుకుని భీమిలి నుంచి భోగాపురం వరకూ రోడ్డు నిర్మాణానికి దాదాపు 1,167 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా వేసినట్టు అధికారులు వెల్లడించారు. బీచ్‌ కారిడార్‌ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సీఎం ఆదేశించారు. భీమిలీ -భోగాపురం రహదారి దేశంలో అందమైన రోడ్డుగా నిలిచిపోవాలని సీఎం అధికారులకు సూచించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణంపైనా కూడా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

పోలవరం నుంచి గోదావరి జలాలను విశాఖనగరానికి తరలింపుపై సీఎం ప్రత్యేకంగా చర్చించారు. రానున్న30 సంవత్సరాల పాటు విశాఖ నగరానికి నీటి అవసరాలను తీర్చేలా ప్రణాళిక రూపొందించి అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్టుగా చేపట్టాలని ఆదేశించారు. దీంతోపాటు విశాఖపట్నం మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌పైనా సమావేశంలో చర్చించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ గేట్‌ నుంచి భోగాపురం వరకూ మొత్తంగా 76.9 కిలోమీటర్ల మేర నిర్మాణానికి డీపీఆర్‌ సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ మార్గంలో 53 స్టేషన్లు ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో పాటు 60.2 కిలోమీటర్ల మేర ట్రాం కారిడార్‌ కూడా ఏర్పాటు చేయనన్నారు. దీంతో మెట్రో, ట్రాం కలిపి 137.1 కిమీటర్ల కారిడార్‌ ను నిర్మించనున్నారు. మెట్రో నిర్మాణానికి దాదాపు 14 వేల కోట్లు, ట్రాం సర్వీసులకు మరో 6వేల కోట్ల కుపైగా ఖర్చు అవుతుందని అధికారులు లెక్క చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి 20వేల రూపాయల కోట్లకుపైగా ఖర్చుకు సంబంధించిన అంచనాలను అధికారులు సీఎంకు అందజేశారు.

తాజాగా విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలోకి ఆ జిల్లాలోని మరో 13 మండలాలను చేరుస్తూ పురపాలకశాఖ నోటిఫికేషన్ జారీ చేయడంతో 431 గ్రామాలు గ్రేటర్ విశాఖలో విలీనమయ్యాయి. కొత్త మండలాల్లోని 2 లక్షల 028 వేల 19 హెక్టార్ల భూమి చేరికతో వీఎంఆర్డీఏ పరిధి 7 వేల328 చదరపు కిలోమీటర్లకు పెరిగినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో పరిపాలనా రాజధానిపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు అయ్యింది.