పెన్సిలు రాత – ‘గ్యాంగ్ లీడర్’ మూవీ రివ్యూ

పెన్సిలు రాత! – ‘గ్యాంగ్ లీడర్’ మూవీ రివ్యూ!

నేచురల్ స్టార్ నాని ‘జెర్సీ’ తర్వాత గ్యాంగ్ లీడరై వచ్చాడు. ‘మనం’ ఫేం దర్శకుడు విక్రం కుమార్ మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అందించాలని ‘గ్యాంగ్ లీడర్’ తీశాడు. ఐదుగురు ఫిమేల్ ఆర్టిస్టులకి నానిని గ్యాంగ్ లీడర్ గా చేసి ఒక థ్రిల్లర్ ని తలపెట్టాడు. తన కిది కొత్త, నానికీ కొత్త, కథ పుట్టించిన ఫిమేల్ ఆర్టిస్టుల పాత్రలకీ కొత్త. ఈ కాన్సెప్ట్ తో అందరూ కొత్త వాళ్ళు కలిసి ఏం చేశారో చూద్దాం…

కథ
ఒక రాత్రి భారీ స్థాయిలో హైటెక్ బ్యాంకు దోపిడీ జరుగుతుంది. ఆరుగురు పాల్గొంటారు. దోచుకున్నాక ఐదుగురిని కాల్చిచంపేసి పారిపోతాడు ఆరోవాడు.14 నెలలు గడిచిపోయినా ప్రభుత్వం ఆరో వాడిని పట్టుకోలేకపోవడంతో, సరస్వతి (లక్ష్మి) అనే 80 ఏళ్ళావిడ ఒక నిర్ణయం తీసుకుంటుంది. చనిపోయిన ఆ ఐదుగురిలో తన మనవడున్నాడు. అలాగే మిగతా నల్గురి కావాల్సిన వాళ్ళు నిస్సహాయులుగా వున్నారు. వాళ్ళందర్నీ కూడగట్టి దోపిడీ దొంగ మీద పగదీర్చుకోవాలనుకుంటుంది. ఆ నల్గురు నడివయస్కురాలైన వరలక్ష్మి (శరణ్య), పెళ్లి కావాల్సిన ప్రియ (ప్రియాంక), స్టూడెంట్ స్వాతి (శ్రియ), ఐదేళ్ళ అమ్మాయి చిన్ను (ప్రాణ్య).

పగదీర్చుకోవడానికి ఐదుగురూ వెళ్లి రివెంజి నవలా రచయిత పెన్సిల్ పార్థసారధి (నాని) ని కలుస్తారు. ముందు వీళ్ళ పగతీర్చి పెడితే తనకేమీ రాదనుకున్న పెన్సిల్ తిరస్కరిస్తాడు. తర్వాత ఈ రివెంజి మీద తానింకో కథ రాయవచ్చని ఒప్పుకుంటాడు. ఇప్పుడు ఈ ఐదుగురినీ కలుపుకుని దోపిడీ దొంగని పెన్సిల్ పార్థసారధి ఎలా పట్టుకున్నాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ

ఎడ్గార్ వాలెస్ (1875 -1932) క్లాసిక్ క్రైం నవలల్లో కథలా వుంది. కానీ తెరకెక్కించడానికి ‘గ్యాంగ్ లీడర్’ కథలో స్టార్ మెటీరియల్ లేదు. ఆ మాట కొస్తే సినిమాగా తీయదగినంత కథ లేదు. గతంలో ఇంద్రగంటి మోహనకృష్ణ తాను ఎడ్గార్ వాలెస్ అభిమానినని వేసుకుని, ‘బందిపోటు’ ని ఆ టైపులో తీస్తూ, మధ్యలో మూస రాజకీయాల కథగా మార్చేశారు. విక్రం కుమార్ థ్రిల్లర్ మూవీ ఎలిమెంట్స్ ని పోషించ లేకపోయారు. ఒక అన్యాయానికి ప్రతీకారమన్నప్పుడు ఆ జరిగిన అన్యాయమేమిటో ముందుగానే సమగ్రంగా ఎస్టాబ్లిష్ చేసి, పగదీర్చుకునే కథ మొదలెడితే కథకీ, పాత్రలకీ బలం వుంటుంది. వాళ్ళ ఎమోషనల్ ట్రావెల్ ని మనం ఫీలవగలుగుతాం. ఫస్టాఫ్ లో దోపిడీలో పాల్గొన్న తమవాళ్ళని చంపాడని చెప్పి ప్రతీకార కథ మొదలెడితే, తమ వాళ్ళు దోపిడీలో పాల్గొన్న క్రిమినల్సే అయినప్పుడు, ఇంకేంటి ఈ ఆడవాళ్లు వచ్చి పగా ప్రతీకారాలని నీతులు చెప్తున్నారని సానుభూతి పుట్టకుండా పోయింది ఫస్టాఫ్ లో. కథకి నైతిక బలం లేకపోవడంతో నాని పాత్రకూడా కుంటుపడింది.

సెకండాఫ్ అరగంట గడిచాక అప్పుడు రివీల్ చేస్తాడుఅసలు విషయం. ఆ ఐదుగురూ ఒకే క్యాన్సర్ బాధితులనీ, అందువల్ల తమవాళ్ళ బాగుకోసం ఈ దోపిడీకి పాల్గొని చనిపోవాలనుకున్నారనీ…ఇదేదో ఫస్టాఫ్ లో అన్యాయం గురించి చెప్పినప్పుడే కలిపి చెప్పేస్తే పోయేదానికి, అనవరంగా అదేదో సస్పెన్స్ పోషణ అన్నట్టు దాచిపెట్టి మొత్తం సినిమాకే హాని చేసుకున్నారు. అరకొర సెటప్ తో బలమైన పేఆఫ్ వుండదు.

అమితాబ్ బచ్చన్ నటించిన సూపర్ హిట్ ‘మజ్బూర్’ వుంది. ఇందులో బ్రెయిన్ ట్యూమర్ తో ఇంకో ఆరునెల్లో తను చనిపోతాననుకున్న అమితాబ్, ఈ విషయం ఇంట్లో చెప్పకుండా, వాళ్ళ సంక్షేమం కోసం ఒక హంతకుడి నుంచి ఐదులక్షలు తీసుకుని, చేయని హత్య మీదేసుకుని ఉరికంబం ఎక్కబోతాడు… వచ్చిన కష్టమేమిటో, అన్యాయమేమిటో ముందే పూర్తిగా చెప్పేసి స్ట్రగుల్ చేస్తే, కథాబలం అనే టానిక్ సినిమాకి అందుతుంది.

ఎవరెలా చేశారు
నాని కొత్త పంథా తొక్కడం మంచిదేగానీ అది నక్కని తొక్కినట్టు లేకపోతే, నాగలోకం బదులు ఇంకేదో త్రిశంకు లోకం అందుతుంది. ‘సూపర్ హిట్టయితే నిద్ర లేపండి, లేకపోతే నిద్ర చెడగొట్ట వద్దు’ అని నాని ట్వీట్ చేయడం మంచి హ్యూమరేగానీ, సినిమా మీద అనుమానాలు తన కెందుకొచ్చాయి…సినిమా విడుదలవగానే ‘డియర్ కామ్రేడ్’ మీద విజయ్ దేవరకొండ, ‘సాహో’ మీద సుజీత్ సెటైర్లు వేసుకున్న పంథా తనూ అనుసరిస్తున్నాడా అన్నట్టుంది.

కీబోర్డుల కాలంలో ‘పెన్సిలు’ సరిపోక నిజంగానే ఆవులించేట్టుంది…కథకి నైతికత లేకపోయినా తొలినలభై నిమిషాల ప్రారంభ దృశ్యాల్ని నాని పాత్ర లైటర్ వీన్ ఫన్ తో లాగించగల్గినా, ఆ తర్వాత నుంచీ ఇక పాత్రకి సినిమాని నిలబెట్టే దమ్ము లేకుండా పోయింది. ఏమాత్రం ఆసక్తి కల్గించని పాత్రగా మిగిలింది.

ఐదుగురు లేడీస్ సమస్య తన సమస్య కాకపోవడంతో ఎమోషనల్ కనెక్ట్ లేకుండా పోయింది. లేడీస్ కి జరిగిన అన్యాయం వాళ్లకి సంబంధించిన గత కథ. ఇప్పుడు నడుస్తున్న కథలో నాని పాత్రకి ఎమోషన్లు పుట్టాలంటే. కథతో తను కనెక్ట్ అవాలంటే, తన సాయం కోరిన ఆ ఐదుగురిలో చిన్నమ్మాయిని కనీసం ఇంటర్వెల్లో నైనా విలన్ చంపెయ్యాలి. వ్యక్తిగత నష్టం లేని థ్రిల్లర్ పాత్రకి అర్ధముండదు.

చిన్నమ్మాయి పాత్రతో కథకి చేయవలసిన మరమ్మత్తు చేయకుండా, ఆమెకేదో అలక సృష్టించి బర్త్ డే పాట పెట్టడం అనవసర పుటేజీగా మిగిలింది. ఉన్న కథకి పానకంలో పుడకలా వుంది.

కార్తికేయ కూడా బలహీన విలన్ పాత్ర కావడం ఇంకో లోపం. ఇతనూ గత కథలో పరోక్షంగా చేసిన హత్యల నేపథ్యంతో వున్నాడే తప్ప, నడుస్తున్న కథలో ప్రత్యక్షంగా ఇంకో దుర్మార్గం చేసినప్పుడే ఎఫెక్టివ్ గా వుండే అవకాశముంది. పాత్ర బలహీనంగా కన్పిస్తూండగా, ఎంతబాగా నటించీ లాభంలేకపోయింది.

లక్ష్మి సహా నటీమణుల పాత్రలకి దాదాపు రెండు గంటలు గడిచే వరకూ నైతిక బలం లేకపోవడంతో వెలవెల బోయారు. రెండు గంటలు గడిచాక పైన చెప్పుకున్నట్టు, వాళ్లకి జరిగిన అన్యాయం సమగ్రంగా జస్టిఫై అయ్యేటప్పటికి ఆలస్యమైపోయింది. అప్పటివరకూ వాళ్ళ మీద కలగని సానుభూతి అకస్మాత్తుగా కలిగే అవకాశం లేకుండా పోయింది. ఈ సానుభూతులూ, ఎమోషన్లూ వంటి కథకి అవసరమైన ఇంధనం, ఫస్టాఫ్ లోనే బిగినింగ్ విభాగంలోనే సమకూరాలి. మిడిల్లో లాభముండదు.
ఇక వెన్నెల కిషోర్ గే కామెడీ అనవసరమైనది. పబ్లిషర్ గా ప్రియదర్శి ఒక సీనులో కన్పించి తెలంగాణా వాళ్ళని నవ్విస్తాడు.
అనిరుధ్ రవిచందర్ స్వరకల్పనలో టైటిల్ సాంగ్, ‘హోయ్ నా హోయ్ నా’ అనే ఇంకో సాంగ్ బావున్నాయి. మిరొస్లా బ్రోజెక్ ఛాయాగ్రహణం ఓమాదిరిగా వుంది.

చివరికేమిటి

ఈసారి విక్రం కుమార్ క్రియేటివిటీ సన్నగిల్లింది. కథని సృష్టించడంలో, కథలో డ్రామాని సృష్టించడంలో వెనుకబడ్డాడు. అభిమానులు ఇది ఆశించరు. తీసుకున్న పాయింటు మాత్రమే కమర్షియల్ గా వుంది. పాయింటుతో చెప్పిన విషయం మార్కెట్ యాస్పెక్ట్ కి దూరంగా వుండిపోయింది. స్త్రీ పాత్రలతో ఈ రివెంజి థ్రిల్లర్ ని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మార్చే వ్యూహంతో పోలేదు. చైల్డ్ ఆర్టిస్టు వున్నా, పిల్లల్ని థియేటర్లకి రప్పించేట్టు పాత్రని డిజైన్ చేయలేకపోయాడు. ఒక్క నాని ఫ్యాన్స్ చాలనుకున్నట్టుంది. నాని ఫ్యాన్స్ కైనా న్యాయం చేయలేదు.

ఇక రెండు గంటల 37 నిమిషాల నిడివి కూడా భారంగా మారింది. ఈ నిడివిని అదుపు చేయలేనందుకే కథకి ఆకస్మిక ముగింపు నిచ్చినట్టుంది. ఒక పెద్ద సినిమాతో ఆకస్మిక ముగింపుతో ఎలా ధైర్యం చేస్తారు.
.

రచన – దర్శకత్వం: విక్రం కుమార్
తారాగణం: నాని, కార్తికేయ, లక్ష్మి, వెన్నెల కిషోర్, ప్రియాంక, శరణ్య, శ్రియ, ప్రాణ్య, ప్రియదర్శి, రఘుబాబు తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్, ఛాయాగ్రహణం: మిరొస్లా బ్రోజేక్<
బ్యానర్ : మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు : మోహన్, చిరంజీవి, రవిశంకర్, నవీన్
విడుదల: సెప్టెంబర్: 13,2019
2.25 / 5

―సికిందర్