నాని సరసన భాగ్యశ్రీ భొర్సే…!

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ హీరో ఎవరంటే ఫస్ట్‌ గుర్తొచ్చే పేరు నేచురల్‌ స్టార్‌ నాని. గతేడాది ‘దసరా’ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న నాని.. ఇటీవలే ‘హాయ్‌ నాన్న’ లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో మరో హిట్‌ అందుకున్నాడు. ఇక ఈ సినిమా అనంతరం నాని వివేక్‌ ఆత్రేయతో ‘సరిపోదా శనివారం’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌లో ఉండగానే నాని మరో స్టార్‌ దర్శకుడితో సినిమా ప్లాన్‌ చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఓజీ దర్శకుడు సుజీత్‌తో తన తదుపరి సినిమాను చేయనున్నాడు నాని. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి అనౌన్స్‌మెంట్‌ వీడియో విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్‌ దక్కించుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక సాలిడ్‌ న్యూస్‌ వైరల్‌ అవుతుంది. ఈ సినిమాలో నాని సరసన టాలీవుడ్‌ లేటెస్ట్‌ సెన్సేషన్‌ భాగ్యశ్రీ భొర్సే నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై భాగ్యశ్రీ భొర్సేతో సంప్రదింపులు జరపగా.. ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.

భాగ్యశ్రీ భొర్సే ప్రస్తుతం రవితేజ హీరోగా వస్తున్న ‘మిస్టర్‌ బచ్చన్‌’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకు హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు విజయ దేవరకొండ ‘జెర్సీ’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి కాంబోలో వస్తున్న మూవీలో కూడా భాగ్యశ్రీ భొర్సే ఎంపికయినట్లు సమాచారం. కాగా ఈ రెండు ప్రాజెక్ట్‌లపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.