వైసీపీకి ఇప్పుడు కావాల్సింది ప్రభుత్వంపై విమర్శలేనా? లేక ముందు సొంత ఇంటిని చక్కదిద్దుకోవాలా? 2024 ఎన్నికల్లో ఎదురైన భారీ ఓటమి తర్వాత పార్టీ మళ్లీ యాక్టివ్ అయింది. జగన్ కూడా ప్రజల్లోకి వస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు పెంచుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే.. వైసీపీ ముందు మరో పెద్ద సమస్య కనిపిస్తోంది. అదే పార్టీ సంస్థాగత బలం.
అధికారంలో ఉన్నప్పుడు నాయకుడి చుట్టూ నేతలు కనిపించడం సహజం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పార్టీ అసలు బలం బయటపడుతుంది. ఇప్పుడు వైసీపీకి అదే పరీక్ష ఎదురవుతోంది. చాలా నియోజకవర్గాల్లో నాయకులు ఉన్నారు. ఇన్ఛార్జ్లు ఉన్నారు. కానీ కార్యకర్తలను ముందుండి నడిపించే నాయకత్వం అన్ని చోట్లా కనిపిస్తోందా అంటే మాత్రం సందేహమే. అందుకే జగన్ జిల్లా పర్యటనలతో సరిపెట్టకుండా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా క్యాడర్తో నేరుగా మాట్లాడాల్సిన సమయం వచ్చిందనే అభిప్రాయం పార్టీలోనే వినిపిస్తోంది.
కొన్ని చోట్ల పాత నేతలే బెటరా?
వైసీపీ నాయకత్వం గతంలో అనేక నియోజకవర్గాల్లో కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చింది. కొన్ని చోట్ల సీనియర్లను పక్కన పెట్టింది. కానీ ఇప్పుడు ఆ ప్రయోగాల ఫలితాన్ని కూడా సమీక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కడప నుంచి చంద్రగిరి వరకు.. నెల్లూరు నుంచి సత్తెనపల్లి వరకు.. ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర వరకు కొన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న నాయకత్వంతోనే ముందుకెళ్లాలా? లేక మార్పులు చేయాలా? అన్న చర్చకు అవకాశం కనిపిస్తోంది. ఇక్కడే మరో ఆసక్తికరమైన అంశం ఉంది. కొత్త ముఖాల కంటే పాత నేతలే బెటర్ అనే పరిస్థితి కొన్ని చోట్ల కనిపిస్తోందా? అనిల్ కుమార్ యాదవ్, మానుగుంట మహీధర్ రెడ్డి, మేకతోటి సుచరిత, గుడివాడ అమర్నాథ్, గొల్ల బాబూరావు వంటి అనుభవం ఉన్న నేతలను పార్టీ ఎలా ఉపయోగించుకుంటుందన్నది కూడా కీలకమే.
వైసీపీకి మరో చిక్కు అమరావతి. గత ప్రభుత్వంలో మూడు రాజధానుల విధానంతో ముందుకెళ్లిన వైసీపీ.. ఇప్పుడు అమరావతి విషయంలో ప్రజలకు ఏం చెప్పబోతోంది?ప్రత్యేకంగా గుంటూరు–విజయవాడ ప్రాంతంలో పార్టీ తిరిగి బలపడాలంటే ఈ అంశంపై క్లారిటీ తప్పదు. పాత నిర్ణయానికే కట్టుబడి ఉంటారా? లేక మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కొత్త వైఖరి తీసుకుంటారా? జగన్ ఏం చెబుతారన్నది ఆసక్తికరం.
ఎంపీ స్థానాల్లోనూ కొత్త ముఖాలు కావాలా?
సమస్య అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితం కాదు. అనంతపురం, హిందూపురం, కర్నూలు, నంద్యాల, ఒంగోలు, బాపట్ల, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, నెల్లూరు, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, నరసాపురం వంటి పార్లమెంట్ స్థానాల్లో కూడా ఇప్పటి నుంచే బలమైన నాయకత్వాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం వైసీపీకి ఉంది.
ఎన్నికలకు ఆరు నెలల ముందు అభ్యర్థిని వెతకడం ఒక పద్ధతి. నాలుగేళ్ల ముందే అభ్యర్థిని రంగంలోకి దించి ప్రజల్లో ఉంచడం మరో పద్ధతి. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి రెండో పద్ధతే ఎక్కువ ఉపయోగపడొచ్చు.
అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. పది మంది ఇన్ఛార్జ్లను మార్చి.. మరో పది మంది సీనియర్లను తీసుకొస్తే వైసీపీ సమస్య పరిష్కారం అయిపోదు. కార్యకర్తకు నాయకత్వం అందుబాటులో ఉందా? స్థానిక నాయకుడికి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉందా? ప్రజా సమస్యలపై పార్టీకి స్పష్టమైన స్టాండ్ ఉందా?ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్న వర్గాలను తనవైపు తిప్పుకోగలుగుతోందా? ఇవే అసలు ప్రశ్నలు.
వైసీపీకి ఇప్పటికీ సమయం ఉంది. 2029 ఎన్నికలు రేపో ఎల్లుండో లేవు. అందుకే ఇప్పుడే తప్పులు గుర్తించి.. అవసరమైన చోట నాయకులను మార్చి.. సీనియర్లను తిరిగి యాక్టివ్ చేసి.. క్యాడర్ను జగన్ నేరుగా తనతో కనెక్ట్ చేసుకోగలిగితే పరిస్థితి మారొచ్చు. లేకపోతే ఎన్నికల ముందు మరోసారి భారీగా ఇన్ఛార్జ్లను మార్చినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. అందుకే జగన్ ముందు ఉన్న ప్రశ్న “ఎవరిని మార్చాలి?” కాదు. “పార్టీని ఎలా మార్చాలి?” అసలు సమాధానం అక్కడే ఉంది.